నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ : వైకాపాలోకి శివాజీరాజా... మెగాబ్రదర్‌కు వ్యతిరేకంగా ప్రచారం...

గురువారం, 21 మార్చి 2019 (15:06 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన మెగా బ్రదర్ నాగబాబు, నటుడు శివాజీరాజాల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గునమండిపోతోంది. ముఖ్యంగా, మావీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు వీరిద్దరి మధ్య మరింత వైరాన్ని పెంచింది. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన శివాజీరాజాను నాగబాబు పనికట్టుకుని మరీ ఓడించారు. దీంతో ఆగ్రహానికి గురైన శివాజీరాజా... త్వరలోనే నాగబాబుకు రిటర్న్ గిఫ్టు ఇస్తానని ప్రకటించారు. 
 
ఇదిలావుంటే, నాగబాబు తన సోదరుడు పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీలో చేరారు. ఆయన నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి జనసేన పార్టీ తరపున పోటీ చేయనున్నారు. దీంతో శివాజీరాజా కూడా కీలక నిర్ణయ తీసుకున్నారు. వైకాపాలో చేరనున్నారు.
 
ఈ విషయంపై శివాజీ రాజా మాట్లాడుతూ, 'మా' ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పని చేసిన వారిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తనకు వ్యతిరేకంగా పని చేసిన కొణిదెల నాగబాబు (పవన్ కల్యాణ్ అన్నయ్య, చిరంజీవి తమ్ముడు)కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ ప్రకటించారు. నాగబాబుపై ఏ ఉద్దేశంతో అటువంటి వ్యాఖ్యలు చేశాడా? అనే విషయం ఎవరికీ అర్థం కాలేదు. ఎలా ఢీకొడతాడా అని అందరూ చర్చించుకోసాగారు. పైగా, ఇది ఇండస్ట్రీలో పెద్ద హాట్‌టాపిక్ అయింది. 
 
మెగా ఫ్యామిలీతో శివాజీ రాజా ఎందుకు పెట్టుకుంటున్నాడు అని కూడా అనుకోసాగారు. వీటికి సమాధానం దొరికేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నటుడు శివాజీరాజా జాయిన్ అవుతున్నట్లు స్పష్టమైంది. హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని జగన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.
 
శివాజీరాజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే నాగబాబుకి వచ్చిన కష్టం-నష్టం ఏంటీ అనే డౌట్ అందరిలో ఉంది. శివాజీరాజా పుట్టింది భీమవరంలో. క్షత్రియులు(రాజలు) ఎక్కువగా ఉండే భీమవరంలో తన వర్గం బలంగా ఉంది అక్కడ. సినీ ఇండస్ట్రీలో రాజుల మద్దతుతోపాటు భీమవరంలో తన సొంత వర్గాన్ని జనసేనకు వ్యతిరేకంగా పని చేయించేందుకు శివాజీ రాజా ప్రయాత్నాలు చేస్తున్నారు. 
 
భీమవరం నుంచే పవన్ కల్యాణ్ కూడా పోటీ చేస్తుండగా.. నాగబాబు పోటీ చేస్తున్న నరసాపురం పార్లమెంట్ పరిధిలోనే భీమవరం కూడా ఉంది. సో.. శివాజీరాజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నాగబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం ఖాయమని తేలిపోయింది. సో... ఇదే.. నాగబాబుకు శివాజీరాజా ఇచ్చే రిటర్న్ గిఫ్టు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు