కోవిడ్-19 సర్వే సిబ్బంది పై భౌతిక దాడులు చేస్తే కఠిన చర్యలు

గురువారం, 30 ఏప్రియల్ 2020 (21:38 IST)
కోవిడ్-19 సర్వే సిబ్బంది పై భౌతిక దాడులు చేస్తే కఠిన చర్యలు  తీసుకుంటామని ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా. కే.ఎస్. జవహర్ రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు.

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కృషి చేస్తున్న ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, ఇతర సిబ్బందిపై కాంటాక్ట్ ట్రేసింగ్ సర్వే సమయంలో, రోగుల మృత దేహాల ఖననాల సందర్భముగా దహన వాటికలలో,  వైద్య సేవలు అందించే ఆసుపత్రులు/క్లినిక్ లు, క్వారంటైన్/ ఐసొలేషన్ కేంద్రాలు, మొబైల్ వైద్య సేవలందించే విభాగాలు తదితర ప్రదేశాల్లో భౌతిక దాడులు జరుగుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది.

కరోనా వైరస్ వ్యాప్తిపై లేని పోని అపోహలతో వైద్య సిబ్బంది విధులకు ఆటకం కలిగించరాదనీ ఈ సందర్భంగా  ప్రజలకు విజ్ఞప్తి చేయటం జరుగుతోంది. కోవిడ్ వ్యాధిగ్రస్తుల యొక్క  కాంటాక్ట్ ల అన్వేషణ వంద శాతం పూర్తి  చేసి, సంబంధిత వ్యక్తులకు తగు పరీక్షలు చేయటం ద్వారానే ఈ వ్యాధి నివారణ త్వరిత గతిన సాధ్య మవుతుంది. 
 
కోవిడ్ వ్యాధిగ్రస్తుల పార్దివ దేహాలను ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం స్టెరిలైజ్  చేసి సీల్ చేయటం జరుగుతుంది. ఇటువంటి మృత దేహాలను పూడ్చటం లేదా కాల్చటం ద్వారా కరోనా  వ్యాప్తికి ఎటువంటి ఆస్కారం ఉండదు. కనుక ప్రజలందరూ ఈ విషయాన్ని అవగాహన చేసుకోవాల్సిందిగా కోరటమైంది. సమాజ హితం కోసం పాటు పడే  వైద్య సిబ్బంది విధుల నిర్వహణకు సమాజంలోని ప్రజలందరూ సహకరించాలి.
 
కేంద్ర ప్రభుత్వం 22 ఏప్రిల్ 2020 న తీసుకొని వచ్చిన ఆర్డినెన్స్ ద్వారా విధి నిర్వహణలో ఉన్న వైద్య/వైద్యేతర సిబ్బందిపై జరిగే దౌర్జన్యకర సంఘటనలన్నింటినీ శిక్షార్హమైన, బెయిలుకు అవకాశం లేని నేరాలుగా ప్రకటించింది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం ఇటువంటి  దౌర్జన్యకర చర్యలకు పాల్పడే లేదా ప్రేరేపించే లేదా ప్రోత్సహించే వారికి 3 నెలల నుంచి 5 సంవత్సరాలు కారాగార వాస శిక్ష, రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు జరిమానా విధించవచ్చు.

అలాగే విధి నిర్వహణలో ఉన్న వైద్య, వైద్యేతర  సిబ్బందిని ప్రమాదకరంగా గాయపరిచే సంఘటనలకు పాల్పడే వారికి 6 నెలల నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలు జరిమానా విధించవచ్చు. దీనికి తోడు ఇలాంటి నేరాలకు పాల్పడిన వారే బాధితులకు నష్టపరిచిన ఆస్తి మార్కెట్ విలువకు రెట్టింపు పరిహారం అందించాల్సి ఉంటుంది.
 
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కృషి చేస్తున్న ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, ఇతర సిబ్బందిపై భౌతిక దాడులకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం  కఠిన చర్యలు తీసుకోవల్సినదిగా జిల్లా కల్లెక్టర్లకు తగు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు