మా దగ్గరకు వస్తే మరో పదేళ్ళ జాప్యం .. హైకోర్టులోనే తేల్చుకోండి : సుప్రీంకోర్టు

మంగళవారం, 27 అక్టోబరు 2020 (13:43 IST)
అగ్రిగోల్డ్ బాధితులకు సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. ఈ కేసు పరిష్కారం నిమిత్తం తమవద్దకు వస్తే న్యాయం జరిగేందుకు మరో పదేళ్ళ సమయం పడుతుందని, అందువల్ల హైకోర్టులోనే తేల్చుకోవాలని కీలక సూచన చేసింది. 
 
దేశంలో అక్రమ డిపాజిట్లను సేకరించే సంస్థలను అరికట్టాలంటూ తెలంగాణ అగ్రిగోల్డ్‌ వినియోగదారులు, ఏజెంట్ల సంక్షేమ సంస్థ అధ్యక్షుడు ఆండాళ్‌ రమేశ్‌ బాబు ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం న్యాయమూర్తులు జస్టిస్‌ ఎల్‌ నాగేశ్వర రావు, జస్టిస్‌ హేమంత్‌ గుప్తా, జస్టిస్‌ అజయ్‌ రస్తోగితో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. 
 
ఈ సందర్భంగా పిటిషనర్‌ తరపున న్యాయవాది కే శ్రవణ్‌ కుమార్‌ వాదించారు. తాము కేసును బదిలీ చేయాలని కోరడం లేదని, హైకోర్టు త్వరగా విచారణ జరపాలని కోరుతున్నామని అన్నారు. చివరిసారిగా 2015లో హైకోర్టులో విచారణ జరిగిందని చెప్పారు. దీని వల్ల అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలం, ఏపీ ప్రభుత్వం డిపాజిట్లకు చెల్లించాలనుకున్న రూ.1050 కోట్లు పంపిణీకి ఆటంకం కలుగుతోందని వివరించారు. 
 
కాగా, కరోనా నేపథ్యంలో హైకోర్టులో తదుపరి విచారణ జరగకపోవచ్చునని అభిప్రాయపడిన ధర్మాసనం... త్వరగా కేసు విచారణ కోసం హైకోర్టునే ఆశ్రయించాలని ఆదేశించింది. హైకోర్టు నుంచి కేసులు, సుప్రీంకు బదిలీ అయితే ఇక్కడ మరో పదేళ్లు ఆలస్యం జరుగుతుందని ధర్మాసనం పేర్కొంది. 
 
'హైకోర్టులో ఉన్న కేసులను ఇక్కడికి బదిలీ చేయాలని కోరితే ఎలా? హైకోర్టు నుంచి ఇక్కడికి కేసును బదిలీ చేసి నోటీసులు జారీ చేస్తే ఇక్కడ మరో పదేళ్లు ఆలస్యం జరుగుతుంది' అని అగ్రిగోల్డ్ అగ్రిగోల్డ్‌ బాధితులను ఉద్దేశించి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు