లక్షకు రూ.30 వేల వడ్డీ పేరుతో మోసం.. అనంతపూరంలో ఘరానా మోసం..

గురువారం, 15 ఏప్రియల్ 2021 (14:40 IST)
రూ.లక్ష పెట్టుబడి పెడితే నెలకు రూ.30 వేలు వడ్డీ చెల్లిస్తామని ఆశజూపారు. కొందరికి మాత్రం అలా చెల్లించారు. అది చూసి అత్యాశకు పోయిన పలువురు రూ.లక్షలు, కోట్లలో సమర్పించుకున్నారు. కొందరు అప్పుచేసి మరీ పెట్టుబడి పెట్టారు. ఇలా సుమారు రూ.300 కోట్లకు పైగా డిపాజిట్లు స్వీకరించిన సదరు వ్యక్తులు ఉడాయించారు. 
 
ఈ ఘటన అనంతపురం జిల్లాలో కలకలం రేపింది. 100 మందికి పైగా బాధితులు ధర్మవరం డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. 50 మంది బాధితులతో ఎస్పీ సత్యఏసుబాబు మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు. నగరంలో ఓ కానిస్టేబుల్‌, జిల్లాలో పనిచేస్తున్న ఓ ఎస్సై కూడా ఏజెంటు తరహాలో నగదు కట్టించినట్లు సమాచారం. 
 
బాధితుల వివరాల ప్రకారం.. ఈబీఐడీడీ ఫైనాన్స్‌ సర్వీసు పేరుతో లావాదేవీలు సాగించారు. చెల్లించిన సొమ్ముకు కొందరికే రశీదులు ఇచ్చారు. ఈ సంస్థ మేనేజర్‌గా కడియాల సునీల్‌ వ్యవహరించారు. ఆయన సహాయకులుగా మహేంద్రచౌదరి, సుధాకర్‌, మాధవి వ్యవహరించారు. వీరి కింద 100 మంది ఏజెంట్లు పని చేస్తున్నట్లు బాధితులు పేర్కొన్నారు. 
 
పెద్ద మొత్తాలు చెల్లించిన తర్వాత  ఏజెంట్ల మొబైల్‌ పని చేయలేదు. రెండు, మూడు నెలలుగా వడ్డీలు చెల్లించలేదు. అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వసంతపురానికి చెందిన బాబుల్‌రెడ్డి ఫిర్యాదు మేరకు ధర్మవరం గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు