ఏపీలో జూన్ 1, ఉదయం 6 గంటల నుంచే పెన్షన్లు పంపిణీ...

సోమవారం, 1 జూన్ 2020 (09:54 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ ఒకటో తేదీ ఉదయం 6 గంటల నుంచే పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. గ్రామ, వార్డు వాలంటీర్లు ఉదయం 6 గంటల నుంచే ఇంటింటికీ వెళ్లి లబ్దిదారులకు పెన్షన్లు అందిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు బయో మెట్రిక్ బదులుగా పెన్షనర్ల చిత్రాలను జియో ట్యాగింగ్ చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రత్యేక మొబైల్ యాప్‌ను సిద్ధం చేసి అందజేశారు. 
 
ఇకపోతే, రాష్ట్రంలో మొత్తం 58.22 లక్షల మందికి పైగా పెన్షనర్లు ఉండగా, వారికి ఈ నెల పెన్షన్ కోసం ప్రభుత్వం రూ.1,421.20 కోట్లను ఇప్పటికే విడుదల చేసింది. అన్ని జిల్లాల్లోని 2.37 లక్షల మందికి పైగా వాలంటీర్లు ఈ డబ్బును లబ్దిదారులకు పంపిణీ చేయనున్నారు. ఒకవేళ లాక్డౌన్ కారణంగా ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారు ఎవరైనా ఉంటే వారికి పోర్టబిలిటీ విధానంలో పెన్షన్లను అందించేందుకు ఏర్పాట్లు చేశారు. 
 
గోదావరి జిల్లాలైన పశ్చిమగోదావరి జిల్లాలో ఉదయం నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. లబ్ధిదారుల ఇంటివద్దకే వాలంటీర్లు వెళ్లి పెన్షన్లు అందజేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 4,75,140 మంది లబ్ధిదారులకు 116.37 లక్షల నగదు పంపిణీ జరుగుతుంది. దెందులూరు నియోజకవర్గం పాలగూడెంలో జరుగుతున్న పింఛన్ల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి పరిశీలించారు. 
 
అలాగే, ఈస్ట్ గోదావరి జిల్లాలో సోమవారం తెల్లవారుజాము నుంచే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లావ్యాప్తంగా ఆరున్నర లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. వేలిముద్రలు పడకపోయిన ఫేస్‌ ఇండెక్స్ ద్వారా పెన్షన్లు అందజేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు