ఏ మీడియంలో చదివించాలో తల్లిదండ్రులే నిర్ణయిస్తారు.. జగన్ సర్కారుకు షాక్

బుధవారం, 15 ఏప్రియల్ 2020 (13:23 IST)
తమ పిల్లలు ఏ మీడియాలో చదివించాలో వారివారి తల్లిదండ్రులే నిర్ణయించుకుంటారనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యా1నించింది. పిల్లలు ఏ మీడియంలో చదువుకోవాలో నిర్ణయించాల్సింది ప్రభుత్వాలు కాదనీ పేర్కొంటూ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా సర్కారు జారీచేసిన ఇంగ్లీష్ మీడియం జీవోలోను కొట్టివేసింది. పైగా, ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియంను కూడా కొనసాగించాలని సర్కారును ఆదేశించింది. ఇది జగన్ సర్కారుకు న్యాయస్థానాల్లో తగిలిన మరో దెబ్బగా భావించవచ్చు. 
 
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలలో ఇంగ్లీష్ మీడియం విద్యను తప్పనిసరి చేస్తూ జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 81, జీవో 85లను హైకోర్టు కొట్టి వేసింది. ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలను సవాల్ చేస్తూ ఏలూరుకు చెందిన డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ దాఖలు చేసిన పిల్‌పై విచారణ జరిపిన హైకోర్టు బుధవారం తీర్పును వెలువరించింది. 
 
ఈ పిటిషన్‌తో పాటు ఇంద్రనీల్ అనే న్యాయవాది వాదిస్తూ, ఏ మీడియంలో చదువుకోవాలనే నిర్ణయాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులే తీసుకుంటారని కోర్టుకు విన్నవించారు. ఇంగ్లీష్ మీడియం వల్ల బ్యాక్ లాగ్లు పెరిగిపోతాయని తెలిపారు. ఈ పిటిషన్లపై హైకోర్టు ఇటీవల వాదనలు విని, తీర్పును రిజర్వ్ చేసింది. బుధవారం తుది తీర్పును వెలువరిస్తూ... 81, 85 జీవోలను కొట్టివేస్తున్నట్టు స్పష్టం చేసింది. ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియంను కూడా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు