ఏపీ రాజధాని మార్పు కేసు విచారణ వాయిదా :: జీవో 107పై షాకిచ్చిన సుప్రీం

సోమవారం, 17 ఆగస్టు 2020 (14:21 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని మార్పు కేసు విచారణను సుప్రీంకోర్టు బుధవారానికి వాయిదావేసింది. అలాగే, ఈ కేసును మరో బెంచ్‌కు లిస్టు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లుల అమలుపై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. ఆ స్టేను ఎత్తివేయాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 
 
దీనిపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి బాబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది. అయితే విచారణ జరుగుతున్న సమయంలో రైతుల తరపున హాజరైన సీనియర్ కౌన్సిల్ రజింత్ కుమార్ ప్రధానన్యాయమూర్తి బాబ్డే దృష్టికి ఓ విషయం తీసుకువచ్చారు. 
 
ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ప్రధాన న్యాయమూర్తికి సంబంధించిన బంధువులు రైతుల తరపున హాజరవుతున్నారని గుర్తుచేశారు. దీంతో ఈ కేసు నుంచి తాను తప్పుకుంటున్నానని బాబ్డే అన్నారు. ఈ కేసును వేరే బెంచ్‌కు లిస్టు చేయాలని రిజిష్ట్రార్‌ను ఆదేశిస్తూ వచ్చే బుధవారానికి వాయిదా వేశారు. 
 
అలాగే, ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టులో మరోమారు చుక్కెదురైంది. రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 107పై హైకోర్టు ఇచ్చిన స్టేను తొలగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం హైకోర్టు ఇచ్చిన స్టేను సమర్ధించింది. 
 
ప్రధాన న్యాయమూర్తి బాబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారణ జరిపించింది. హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. రాష్ట్ర ప్రభుత్వం తమ వాదనలను హైకోర్టులోనే వినిపించుకోవాలని... అక్కడ ఇచ్చిన స్టేను ఎత్తివేయడానికి నిరాకరిస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు