ఉత్తరాంధ్ర గద్దర్ లేరన్న వార్త కలిచివేసింది : జగన్ - కేసీఆర్

మంగళవారం, 4 ఆగస్టు 2020 (11:41 IST)
ప్రముఖ ప్రజాగాయకుడు వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో బాధపడుతూ ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సంతాపం తెలిపారు. ఆయన సేవలను గుర్తు తెచ్చుకున్నారు.
 
'వంగపండు ఇక లేరన్న వార్త ఎంతో బాధించింది. ఆయన వ్యక్తిగతంగా నాకు ఆప్తులు. జానపదాన్ని తన బాణీగా మార్చుకుని ‘‘పాముని పొడిచిన  చీమలు’’న్నాయంటూ ఉత్తరాంధ్ర ఉద్యమానికి అక్షర సేనాధిపతిగా మారారు. వంగపండు కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను' అని జగన్ ట్వీట్ చేశారు. 
 
మాజీ ఎమ్మెల్యే, సీపీఎం సీనియర్ నాయకుడు సున్నం రాజయ్య, ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారని తెలంగాణ సీఎంవో పేర్కొంది.
 
'సున్నం రాజయ్య మరణం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేసిన రాజయ్య అత్యంత నిరాడంబర రాజకీయ నాయకుడిగా హృదయాల్లో నిలిచి పోతారని సీఎం అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు' అని సీఎంవో ట్వీట్ చేసింది.
 
'ప్రఖ్యాత జానపద వాగ్గేయకారుడు, గాయకుడు వంగపండు ప్రసాదరావు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తంచేశారు. ప్రజల బాధలు - సమస్యలు, ప్రజా ఉద్యమాలే ఇతి వృత్తంగా పాటలు రాసి, పాడి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి జీవితాంతం పాటుపడ్డారన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు' అని సీఎంవో పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు