బాబుగారి నిరసనల తీర్మానం... ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా...

గురువారం, 31 జనవరి 2019 (16:54 IST)
నిన్న మొన్నటి వరకు చెట్టాపట్టాలేసుకు తిరిగి, అప్పట్లో ఎవరెన్ని చెప్పినా హోదా అక్కర్లేదు... ప్యాకేజీ చాలు అని కాలం వెళ్లబుచ్చేసిన చంద్రబాబుగారికి హఠాత్తుగా ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్రం తీరు నచ్చకపోతూండడంతో, కేంద్ర వైఖరికి నిరసనగా ఆందోళనలు చేపట్టబోతున్నట్లు తెలిపారు. 
 
బుధవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 13వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపట్టనున్నట్లు తెలియజేశారు. 11న ఢిల్లీలో ఆందోళన చేస్తామని, 12న రాష్ట్రపతి దగ్గరకు అఖిలపక్షం వెళుతుందని ఈ మేరకు అఖిలపక్ష సమావేశంలో తీర్మానం చేసినట్లు చంద్రబాబు పేర్కొన్నారు.
 
తన కంటే నరేంద్ర మోదీ చాలా జూనియర్ అయినప్పటికీ.. ఆయన ఈగోను సంతృప్తిపరిచేందుకే ఆయనని సార్ అని సంభోదించానని చెప్పుకొచ్చిన చంద్రబాబు, ఆంధ్రపై ప్రధాని కనికరం చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం పోరాడినవారిపై కేసులు ఎత్తివేస్తామని పేర్కొన్నారు. దీనిపై రేపు జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు.
 
ఎన్నికలు ముంచుకొచ్చే కొద్దీ బాబుగారికి ఇంకా ఏమేమి గుర్తుకొస్తాయో ఏమో మరి... మరిన్ని వివరాల కోసం వేచి చూద్దాం...

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు