30 నిమిషాల్లో కోవిడ్‌ పేషెంట్‌కు బెడ్‌: జగన్‌

మంగళవారం, 28 జులై 2020 (22:37 IST)
కోవిడ్‌ పేషెంట్‌కు 30 నిమిషాల్లోగా ఆస్పత్రిలో బెడ్డు కేటాయించాలనని సీఎం వైయస్‌.జగన్‌ అధికారులను ఆదేశించారు. కోవిడ్‌ ఆస్పత్రుల్లో బెడ్లను సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. బెడ్ల పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆదేశాలు జారీచేశారు.

కోవిడ్‌ఆస్పత్రల్లో వైద్య పరికరాలు, అత్యవసర సేవలు, సదుపాయాల్లో ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలన్నారు. దీనికోసం ఎంత ఖర్చైనా వెనుకడుగు వేయొద్దని స్పష్టంచేశారు.

కాల్‌ సెంటర్లు సమర్థవంతంగా పనిచేయాలని, వాటికి వచ్చే సమాచారం ఆధారంగా వెంటనే స్పందించాలన్నారు. ప్రతి కోవిడ్‌ ఆస్పత్రివద్దా వైద్య చికిత్స, అవసరాలకు సరిపడా సిబ్బంది, భోజనం, పారిశుద్ధ్యం తదితర అంశాల్లో ఫిర్యాదులు స్వీకరించడానికి 1902 నంబర్‌ను ఉంచాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేశారు. 
 
స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లాల కలెక్టర్లు, జేసీలు, పోలీసు అధికారులతో రాష్ట్రంలో కోవిడ్‌నివారణా చర్యలపై సీఎం  వైయస్‌.జగన్‌ సమీక్షించారు. కోవిడ్‌పేషెంట్ల విషయంలో అనుసరించాల్సిన విధానాన్ని  కలెక్టర్లకు వివరించారు. కోవిడ్‌ నివారణా చర్యలపై కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకూ ప్రతి అధికారి సీరియస్‌గా పనిచేశారని ముఖ్యమంత్రి అన్నారు. 

కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నప్పుడు సహజంగానే భయపడతారు, కేసులు సంఖ్య  తగ్గించి చూపే ప్రయత్నం చేస్తారు. కాని, ప్రభుత్వం ఎక్కడాకూడా అలాంటి వాటికి తావు ఇవ్వలేదు. ఎక్కడా కూడా తప్పులు చేయలేదు. కోవిడ్‌ పరిస్థితులు తలెత్తినప్పటినుంచి కూడా శరవేగంతో పనిచేశాం, వైరస్‌ను నిర్ధారించడానికి అత్యంత వేగంతో ల్యాబులను ఏర్పాటు చేసుకున్నామన్నారు.

రికార్డు స్థాయిలో ఒకరోజుకు 50వేలకుపైగా టెస్టులు చేస్తున్నాం. దేశంలోనే ఇది అత్యధికం. ప్రతి 10 లక్షల మంది జనాభాలో 31వేల మందికిపైగా టెస్టులు చేస్తున్నారు. ఈ టెస్టులు కూడా వైరస్‌ వ్యాప్తి ఉన్న క్లస్టర్లలో చేస్తున్నాం.

పాజిటివ్‌ కేసులను వీలైనంత త్వరగా గుర్తించడం, వారి కాంటాక్టులను ట్రేస్‌ చేయడం, పాజిటివ్‌ వచ్చిన వారికి వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. అధికారులు బాగా చేశారు కాబట్టే ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయగలిగామని సీఎం చెప్పారు. 

పాజిటివ్‌ కేసులు గుర్తించిన తర్వాత చేయాల్సిన పనులు ఉన్నాయని, ఉన్న డేటాను విశ్లేషించుకుని ముందడుగులు వేయాల్సి ఉందన్నారు. కోవిడ్‌తో కలిసి జీవించాల్సిన పరిస్థితులు ఇప్పుడున్నాయన్నారు.

‘‘కోవిడ్‌ అన్నది వస్తుంది, పోతుంది కూడా. వ్యాక్సిన్‌ వచ్చేంతవరకూ మనం వేచిచూడాలి. అలాగే మన దగ్గర లక్షకుపైగా కేసులు నమోదైతే అందులో సగంమందికి పైగా నయం అయిపోయి ఇళ్లకు కూడా వెళ్లిపోయారు. అలాగే నమోదవుతున్న కేసుల్లో 85శాతం మందికి ఇళ్లలోనే నయం అవుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం.

అలాగే దేశవ్యాప్తంగా మరణాల రేటు దాదాపు 2.5శాతం ఉంటే మన దగ్గర రూ. 1.06శాతం ఉంది. కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడం వల్లే ఇది సాధ్యం అయ్యింది.

పెద్ద పెద్ద రాష్ట్రాల మాదిరిగా మన దగ్గర అత్యాధునిక ఆస్పత్రులు లేకపోయినప్పటికీ మరణాలరేటును 1.06శాతానికి పరిమితం చేయగలిగాం. ఇది మనం సాధించిన విజయంగా చెప్పొచ్చు’’ అని సీఎం అన్నారు. కాని, తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోవాలన్నారు. 
 
ప్రజల్లో తీవ్ర భయాందోళనలను తగ్గించాల్సి ఉందని, వారిలో అవగాహన కల్పించడానికి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని సీఎం కలెక్టర్లను ఆదేశించారు. కోవిడ్‌ వచ్చిందన్న అనుమానం రాగానే ఎక్కడకు వెళ్లాలి? ఎక్కడకు పరీక్షలు చేయించుకోవాలి?

ఎవరికి కాల్‌ చేయాలన్నదానిపై వివరాలు అందరికీ తెలియజేయాలన్నారు. ఈ వివరాలు తెలియని మనిషి రాష్ట్రంలో ఉండకూడదన్నారు. దీనికి సంబంధించి ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో పోస్టర్లు ఉంచాలని, అందులో నంబర్లు ఉంచాలని సీఎం ఆదేశించారు. 

కోవిడ్‌ నివారణాచర్యల్లో వైద్య సహాయం కోసం 104, 14410 కాల్‌ సెంటర్‌ నంబర్లు ఇప్పటికే పనిచేస్తున్నాయని, దీనికి తోడు జిల్లాల్లోని కోవిడ్‌ కంట్రోల్‌ రూం కాల్‌ సెంటర్‌ నంబర్‌ కూడా ఉందన్నారు. ఈ మూడు ప్రధాన నంబర్లకు ఎవరైనా కాల్‌ చేసినప్పుడు, వారికి సమర్థవంతంగా సేవలందాలన్నారు.

ఈ కాల్‌ సెంటర్ల పనితీరును అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలన్నారు. కాల్‌ రాగానే సంబంధిత వ్యవస్థలు సక్రమంగా స్పందిస్తున్నాయా? లేదా? తనిఖీచేయాలని ఆదేశించారు. 
 
కోవిడ్‌ పాజిటివ్‌ కేసును గుర్తించిన తర్వాత వారి ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి 1. హోం క్వారంటైన్, 2. కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ 3. జిల్లా కోవిడ్‌ ఆస్పత్రి 4. రాష్ట్రస్థాయి కోవిడ్‌ ఆస్పత్రులకు పంపించాలన్నారు. 

హోంక్వారంటైన్‌ కోసం ఇంట్లో వసతులు ఉంటే... రిఫర్‌ చేయాలని, 
ఇంట్లో ప్రత్యేక గది లేని పక్షంలో వారిని ... కోవిడ్‌ కేర్‌ సెంటర్‌కు పంపించాలన్నారు. హోంక్వారంటైన్‌లో ఉన్న ఆవ్యక్తిని పూర్తిగా పర్యవేక్షించాలన్నారు. డాక్టర్‌ తప్పనిసరిగా విజిట్‌ చేయాలని, వారికి మందులు అందుతున్నాయా? లేదా? చూడాలన్నారు. క్రమం తప్పకుండా.. వారి ఆరోగ్య వివరాలను కాల్‌ చేసి కనుక్కోవాలని, ఈ చర్యలన్నీ తప్పకుండా తీసుకోవాలని సీఎం ఆదేశించారు. కోవిడ్‌ కేర్‌సెంటర్లలో డాక్టర్లను అందుబాటులో ఉంచాలని సీఎం స్పష్టంచేశారు.

పారిశుద్ధ్యం, ఆహారంపై తప్పకుండా ధ్యాసపెట్టండి: "నాణ్యమైన మందులు ఇస్తున్నారా? లేదా? చూడండి, క్రమం తప్పకుండా డాక్టర్లు వెళ్తున్నారా? లేదా? చూడండి’’ అని సీఎం అధికారులను ఆదేశించారు. 
 
కోవిడ్‌ సోకినవారి చికిత్స కోసం 128 జిల్లా ఆస్పత్రులను పెట్టుకున్నామని,  ఇక్కడ సదుపాయాలను తప్పనిసరిగా పర్యవేక్షించాలని, 30 నిమిషాల్లో పేషెంట్‌ అడ్మిషన్‌ జరగాలని సీఎం స్పష్టంచేశారు. పేషెంట్‌ ఏ ఆస్పత్రికి వచ్చినా సరే, ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితులను డాక్టర్‌ దృష్టిలో ఉంచుకుని ఎక్కడకు పంపాలన్నదానిపై నిర్ణయించాలనన్నారు.

128 జిల్లా ఆస్పత్రులు, 10 రాష్ట్రస్థాయి ఆస్పత్రుల్లో బెడ్ల పరిస్థితిపై ఎప్పటికప్పుడు డిస్‌ ప్లే చేయాలని, ఈ వివరాలను పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టాలన్నారు. ఆస్పత్రుల్లో బెడ్లు అమ్ముకున్నట్టుగా... కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ఘటనలు వార్తాఛానళ్లలో చూస్తున్నాం, ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో రాకూడదన్నారు. మానవత్వంతో ఈ సమస్యలను పరిష్కరించడానికి మనం ప్రయత్నించాలని, బలమైన వ్యవస్థను అందుబాటులోకి తీసుకోవాలన్నారు. 
 
రాష్ట్రస్థాయి ఆస్పత్రుల్లో 8వేల బెడ్లు ఉన్నాయని, వీటిని క్రిటికల్‌ కేర్‌ కోసం వినియోగించాలన్నారు. కోవిడ్‌ లక్షణాలు తక్కువగా ఉన్నవారిని క్రిటికల్‌ కేర్‌ఆస్పత్రులకు పంపి ఉపయోగం లేదని సీఎం అన్నారు. బెడ్లను సమర్థవంతగా వినియోగించుకునే వ్యవస్థ ఉండాలన్నారు. అయితే కోవిడ్‌ సోకిన కారణంగా వ్యాధి లక్షణాలు బాగా కనిపించేవారిని ఏదో ఒక ఆస్పత్రిలో చేర్పించాలన్నారు.

అరగంటలోపు కోవిడ్‌ పేషెంట్‌కు బెడ్‌ కేటాయించాలని, ఎవరైనా పేషెంట్‌వస్తే బెడ్డు దొరకలేదనే మాట రాకూడదన్నారు. ఇలా జరిగితే మానవత్వంమీద మాట వస్తుందన్నారు. ఈ విషయంలో కలెక్టర్, జేసీలను తప్పనిసరిగా బాధ్యులను చేస్తానని సీఎం గట్టిగా చెప్పారు. వైద్యులు మానవత్వం చూపించాలని, ఏ ఆస్పత్రి కూడా నిరాకరించే ధోరణిలో ఉండకూడదని, అలా ఉంటే ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 
 
కోవిడ్‌ కేర్‌ సెంటర్లు, జిల్లా కోవిడ్‌ ఆస్పత్రులు, రాష్ట్రస్థాయి కోవిడ్‌ఆస్పత్రులవద్ద చికిత్స, సదుపాయాలు, పారిశుధ్యం, భోజనంపై ఏమైనా ఫిర్యాదులు ఉంటే చేయడానికి 1902 నంబర్‌ను డిస్‌ప్లే చేయాలని సీఎం ఆదేశించారు. ప్రతిచోటా పెద్ద అక్షరాలతో ఈ నంబర్‌ డిస్‌ ప్లే చేయాలన్నారు. ఆస్పత్రిలో సదుపాయాలు బాగోలేదని ఎవరైనా కంప్లైంట్‌ చేస్తే.. వెంటనే స్పందించాలని సీఎం ఆదేశించారు.

ఇలా వచ్చే సమాచారాన్ని పాజిటివ్‌గా తీసుకోవాలని, దీనివల్ల సమస్యలను పరిష్కరించుకునే అవకాశం వస్తుందన్నారు. ఇవన్నీ మనం కరెక్టుగా చేయగలిగితే.. కోవిడ్‌ ఉన్నా.. దాన్ని ఎదుర్కొంటూ మంచి వాతావరణంలో బతకగలుగుతామని సీఎం చెప్పారు. కోవిడ్‌ నివారణ చర్యల గురించి ఖర్చు విషయంలో రాజీ పడొద్దని,  ఇబ్బందులున్నా... నేను పడతా.. మీ వరకూ ఇబ్బందులు రానివ్వనని సీఎం కలెక్టర్లతో వ్యాఖ్యానించారు. 
 
వచ్చే 6 నెలలపాటు 17వేల మంది డాక్టర్లు, సిబ్బందిని నియమించుకోవడానికి పర్మిషన్‌ కూడా ఇచ్చామని, వచ్చే వారంరోజుల్లో కొరత లేకుండా వీరిని నియమించుకోవాలన్నారు. ఆక్సిజన్‌ బెడ్స్‌ను పెంచాలని నిర్ణయం తీసుకున్నామని, వచ్చే 15రోజుల్లో అవి అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు.

రాష్ట్రస్థాయిలో ఉన్న 10 క్రిటికల్‌ కేర్‌ ఆస్పత్రులు, అలాగే జీజీహెచ్‌ ఆస్పత్రుల్లో రెమిడెసివర్‌.. లాంటి ఖరీదైన మందులను అందుబాటులో ఉంచాలని, పేషెంట్‌కు కనీసం రూ.30–35వేలు ఖర్చు అవుతున్నా, వీటిని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందన్నారు. 
 
కోవిడ్‌ కారణంగా మరణించిన వారి విషయంలో ఇటీవల జరిగిన ఘటనలపై ముఖ్యమంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి ఘటనల్లో మానవత్వం కనుమరుగుఅవుతోందని వ్యాఖ్యానించారు. కోవిడ్‌రావడమన్నది పాపం కాదని, నేరం కాదని అన్నారు. కోవిడ్‌కారణంగా ఎవరైనా చనిపోతే..  వారి నుంచి కోవిడ్‌ వ్యాపించకుండా అన్నిరకాల చర్యలు తీసుకుంటారని, చనిపోయినవారిలో కొన్ని గంటల తర్వాత వైరస్‌ కూడా ఉండదని సీఎం పేర్కొన్నారు.

అయినా సరే సొంత బంధువులకూ అంత్యక్రియం నిర్వర్తించకపోవడం విచారకరమన్నారు. మానవత్వమే మరుగున పడుతున్న పరిస్థితులు చూస్తున్నామన్నారు. కోవిడ్‌కారణంగా ఎవరైనా చనిపోతే రూ.15వేలు ఇవ్వాలని, బంధువులెవరైనా రాకపోతే.. ప్రభుత్వమే దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహిస్తుందని సీఎం స్పష్టంచేశారు.

దీనిపై ప్రభుత్వం వైపు నుండి గట్టి సంకేతం పోవాలన్నారు. కోవిడ్‌కారణంగా భయాందోళనలు పోవాలనని, అవగాహన పెంచుకుని, ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. 
 
వర్షాకాలం ప్రారంభం అయ్యిందని, సీజన్‌ వ్యాధులు వస్తాయని, డయేరియా, డెంగ్యూ, మలేరియా, చికెన్‌ గున్యా లాంటి జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం కలెక్టర్లను ఆదేశించారు. కంట్రోల్‌ రూమ్స్‌కు కేవలం కోవిడ్‌ కోసమే కాకుండా... ఇతర ఆరోగ్య సమస్యల గురించి ఎవరైనా కాల్‌చేస్తే వెంటనే చర్యలు తీసుకునేలా ఉండాలన్నారు.

అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని, పారిశుధ్యాన్ని మెరుగ్గా నిర్వహించాలని, ఇది కూడా చాలా ప్రాధాన్యతతో కూడిన కార్యక్రమమని సీఎం స్పష్టంచేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు