బీజేపీ రాష్ట్ర కొత్త రథసారథిగా సోము వీర్రాజు - కన్నాకు అందుకే చెక్ పెట్టారా?

మంగళవారం, 28 జులై 2020 (07:16 IST)
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ కొత్త రథసారథిగా సోము వీర్రాజు నియమితులయ్యారు. ఆ స్థానంలో ఇప్పటివరకు ఉన్న మాజీ మంత్రి, సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ స్థానంలో సోము వీర్రాజును బీజేపీ అధ్యక్షుడు జేడీ నడ్డా నియమించారు. 
 
కొంతకాలంగా ఏపీ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలే కన్నా స్థానంలో సోము వీర్రాజు నియామకానికి కారణమని తెలుస్తోంది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సోము వీర్రాజు ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. 
 
కాగా, గత కొంతకాలంగా ఏపీ సర్కారుపై కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా, ఈయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా నడుచుకుంటున్నారంటూ వైకాపా నేతలు పదేపదే ఆరోపణలు గుప్పిస్తున్నారు. 
 
అంతేకాకుండా, ఏపీ రాజధాని అమరావతి విషయంలోనూ కన్నా లక్ష్మీనారాయణ సొంత అజెండాతో ముందుకు సాగుతున్నారంటూ వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కన్నాను తొలగించి, ఎమ్మెల్సీగా ఉన్న సోము వీర్రాజును బీజేపీ అధిష్టానం నియమించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు