బిజెపి, వైకాపా, టిడిపి, జనసేన దుష్టచతుష్టయ పార్టీలు: తులసి రెడ్డి

ఆదివారం, 7 మార్చి 2021 (11:41 IST)
బిజెపి, వైకాపా, టిడిపి, జనసేన పార్టీ లు దుష్టచతుష్టయ పార్టీలని, బిజెపికి వైకాపా, టిడిపి, జనసేనలు బానిస పార్టీలని, ఈ దుష్ట చతుష్టయ పార్టీలను ఓడించి, కామదేనువు లాంటి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి పిలుపునిచ్చారు.

బిజెపి మోసకారి తనం వల్ల, వైకాపా, టిడిపి ల చేతకానితనం వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు.. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా రాలేదని, రాయలసీమకు బుందేల్ఖండ్ తరహా ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ నిధులు రాలేదని, కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు కాలేదని విచారం వ్యక్తం చేశారు.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెచ్చిన ముస్లిం వ్యతిరేక పౌరసత్వ చట్టానికి, రైతుల వ్యతిరేక వ్యవసాయ చట్టాలకు, కార్మిక వ్యతిరేక కార్మిక చట్టాలకు, వైకాపా, టిడిపి, జనసేన పార్టీలు మద్దతు ఇచ్చాయని గుర్తు చేశారు. బిజెపి చేతిలో వైకాపా, టిడిపి, జనసేన లు కీలుబొమ్మలనీ, కబాళీలని ఎద్దేవా చేశారు.

పన్నులు, ధరలు పెంచడం ద్వారా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటున్నయన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ దిశగా, వంటగ్యాస్ ధర పదవ సెంచరీ దిశగా పయనిస్తున్నాయన్నారు.

జగన్ ప్రభుత్వం ఇప్పటికే సిమెంటు, ఇసుక, మద్యం, సబ్సిడీ కందిపప్పు ధరలు పెంచిందని, ఆర్టీసీ, విద్యుత్, పౌర సేవల చార్జీలు పెంచిందని, ఏప్రిల్ 1 నుండి పట్టణాలు, నగరాల్లో ఆస్తి పన్ను, త్రాగు నీటి పన్ను, మురుగు నీటి పన్ను పెంచుతుందన్నారు.

కుక్క కాటుకు చెప్పు దెబ్బ సామెత లాగా త్వరలో జరగబోయే ఎన్నికల్లో దుష్ట చతుష్టయ పార్టీలను ఓడించి, కామదేనువు లాంటి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని తులసి రెడ్డి విజ్ఞప్తి చేశారు. పాడిఆవుకు పచ్చి గడ్డి వేస్తే పాలు ఇస్తుంది.

గొడ్డుటావులకు గడ్డి వేస్తే గంజు మాత్రమే పోస్తాయి. కాబట్టి పాడిఆవు లాంటి కాంగ్రెస్ పార్టీకి పచ్చి గడ్డిలాంటి ఓట్లు వేయండి పాలు పిండు కోండి అని తులసిరెడ్డి పిలుపునిచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు