వైఎస్ వివేకా హత్య కేసు : రంగంలోకి దిగిన సీబీఐ టెక్నికల్ టీమ్ - సీన్ రీకన్‌స్ట్రక్షన్

శనివారం, 25 జులై 2020 (10:38 IST)
వైకాపా నేత, మాజీ మంత్రి, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ వేగవంతం చేసింది. ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు సేకరించలేక పోయిన సీబీఐ.. ఇపుడు టెక్నికల్ టీమ్‌ను రంగంలోకి దించింది. 
 
ఈ కేసు విచారణలో భాగంగా నేడో రేపో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పులివెందులలో నేడు కీలక వ్యక్తులను విచారించనుంది. ఇప్పటికే శుక్రవారం వివేకా పీఏ క్రిష్ణారెడ్డిని, వాచ్‌మెన్ రంగన్నని అతని కుమారుడు ప్రకాష్‌ను సీబీఐ అధికారులు విచారించారు. గత రెండు రోజులుగా వివేకా నివాస పరిసర ప్రాంతాలను సీబీఐ, సాంకేతిక నిపుణుల బృందాలు పరిశీలిస్తున్నాయి. 25 మందికి పైగా సీబీఐ, సాంకేతిక బృందాలు రంగంలోకి దిగాయి.
 
మరోవైపు, ఈ కేసు విచారణ నిమిత్తం ఢిల్లీ, చెన్నై నుంచి వచ్చిన సీబీఐ అధికారుల బృందం కడపలో ఉంటూ, రోజూ పులివెందుల వెళ్లి దర్యాప్తు చేసి వస్తున్నారు. వాచ్‌మెన్‌గా ఉన్న రంగన్నతో పాటు కారు డ్రైవర్ ప్రసాద్‌ను శుక్రవారం విచారించారు. ఈ విచారణ జరుపుతూ వివేకాను హత్య చేసిన ఇంట్లో సీన్ రీకన్ స్ట్రక్షన్ చేస్తున్నారు. సీబీఐ విచారణ నేపథ్యంలో పులివెందులలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు