చంద్రబాబుకు రాష్ట్ర అభివృద్ధి మీద ధ్యాస లేదు: బొత్స సత్యనారాయణ

శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (08:15 IST)
"చంద్రబాబు ఎంత సీనియర్ అయినా కుప్పంకు ఒరిగిందేమిటి? కుప్పం రుణం బాబు తీర్చుకుంటే.. ఎందుకు ఘోరంగా ఓడిస్తారు?  విశాఖను పరిపాలనా రాజధానిగా నిర్ణయిస్తే చంద్రబాబు నోరు మెదపరు" అని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. 
 
ఆయన మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే..
1. అమరావతి రాజధానిలో సీడ్ యాక్సిస్ రోడ్డును విజయవాడ వరకు వేయవద్దని చంద్రబాబును ఎవరు ఆపారు.  సీడ్ యాక్సిస్ రోడ్డు కూడా చంద్రబాబు గ్రాఫిక్స్ లో భాగమే. దానిని ఈరోజుకీ ఆయన అనుకూల మీడియాలో ఒక అద్భుతంగా రాయడం దుర్మార్గం. ఎవరి కోసం ఈనాడు ఈ తప్పుడు రాతలు రాస్తోంది. రాసేటప్పుడు ప్రభుత్వం వివరణ తీసుకుంటే బాగుండేది. 

-అలానే ఐకానిక్ బ్రిడ్జి కట్టొద్దని చంద్రబాబుని ఎవరు ఆపారు...? ఆ ఇడ్లీ పాత్ర నిర్మాణాలు, ఐఫిల్ టవర్ అమెరికాలో ఉన్న బిల్డింగ్స్, దుబాయ్ లో ఉన్న టవర్లు అన్నీ పెట్టి చేసిన గ్రాఫిక్స్ కట్టవద్దని చంద్రబాబును ఎవరు ఆపారు...?
 
2. మూడు క్యాపిటల్స్ అనేది వైయస్ఆర్ కాంగ్రెస్  ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం. దానికి అనుగుణంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తోంది. 
 
3. శాసన రాజధానిగా అమరావతిని నిర్ణయించిన నేపథ్యంలో.. అమరావతిలో అసంపూర్తిగా నిలిచిపోయిన నిర్మాణాలపై ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు వెళుతుంది. రూ. ఈ ప్రాంత అభివృద్ధికి రూ. 3 వేల కోట్ల కు  బ్యాంకు గ్యారెంటీకి కూడా అనుమతి ఇచ్చాం.

రూ. 150 కోట్లతో కరకట్ట రోడ్డును ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో నిర్మాణం చేపడుతున్నాం. తక్కువ ఖర్చుతో అందరికీ ఆమోదయోగ్యంగా, దీర్ఘ కాలిక ప్రణాళికతో వీటికి కార్యాచరణ రూపొందించాం. ప్రస్తుతం అసంపూర్తిగా ఉన్న సీడ్ యాక్సిస్ రోడ్డును కాజా గ్రామం దగ్గర కలిపి, నేషనల్ హైవేకు అనుసంధానం చేస్తున్నాం. 

- అమరావతి రాజధాని ప్రాంతంలో గత ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు, రోడ్లు, డ్రైనేజీ, కరెంటు తదితర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం. 
 
4. దౌర్భాగ్యం ఏమిటంటే.. 5 ఏళ్ళు అధికారంలో ఉండి, ప్రజా ధనాన్ని పెద్దఎత్తున దుర్వినియోగం చేసి టెంపరెరీ అసెంబ్లీ, టెంపరెరీ సెక్రటేరియట్ కట్టిన చంద్రబాబు కనీసం సీడ్ యాక్సిస్ రోడ్డు వేయలేకపోయారు. 

- కరకట్ట రోడ్డుకి రూ. 550 కోట్లు అంచనాలు రూపొందించి.. రూ. 300 కోట్లతో రెండు పక్కల రాతి కట్టడంతో గోడ కట్టడానికి  ఎస్టిమేట్స్ వేశారు. అంటే అంచనాల్లోనే ఎంత దుర్వినియోగం చేయాలని చూశారో అర్థమవుతుంది. 
 
5. సిద్ధంగా ఉన్నది వద్దని.. అంటూ ఎవరి సానుభూతి కోసం ఈనాడు పత్రిక ఇటువంటి కథనాలు రాస్తుంది. ఇంకా ల్యాండి అక్విజేషన్ జరగాలి. ల్యాండ్ పూలింగ్ కు రైతులు భూములు ఇవ్వలేదు. కోర్టుల్లో కేసులు పెండింగ్ లో ఉన్నాయి. 

- కరకట్టకు అనుసంధానంగా ఉన్న చిన్న వంతెనను కూడా, అంటే ఒక కారు వెళుతుంటే.. ఎదురుగా  ఒక ఆటో కూడా రాలేని బ్రిడ్జి అక్కడ ఉంటే, చంద్రబాబు తన 5 ఏళ్ళ పాలనలో అక్కడ ఏ నిర్మాణమూ, ఎందుకు చేయలేకపోయాడు, ఐకానిక్ బ్రిడ్జి ఎందుకు కట్టలేకపోయాడు...?
 
6. చంద్రబాబు సీడ్ యాక్సెస్ రోడ్డు వేస్తుంటే ఎవరైనా అడ్డు పెట్టారా.. కనీసం ల్యాండ్ అక్విజేషన్ కూడా చంద్రబాబు చేయలేకపోయారు. ఇది చంద్రబాబు అసమర్థత కాదా..?
 
7. వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. అనవసర హంగులకు పోయి, గ్రాఫిక్స్ చూపించి ప్రజలను మోసగించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు అనుకోరు. ఏ పని చేసినా పూర్తి పారదర్శకంగా, ప్రజలకు ఉపయోగపడే విధంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. 
 
8. చంద్రబాబు పార్టీ ఇప్పటికే మట్టి కొట్టుకుపోయింది. ఈరోజు చంద్రబాబు కుప్పంలో మాట్లాడిన మాటల్లో, ఆయన ఆక్రోషం, కడుపుమంట కనిపించింది. కుప్పం మీద చంద్రబాబుకు అంత ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే కుప్పంను అర్బనైజేషన్ చేయాలి, కనీసం మున్సిపాల్టీ చేయాలి, కనీసం నగర పంచాయితీ చేయాలన్న ఆలోచన చంద్రబాబుకు ఎందుకు రాలేదు. 
 
9. చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి అయనా, ప్రతిపక్ష నాయకుడు అయినా, 25 ఏళ్ళుగా పార్టీ అధ్యక్షుడు అయినా కుప్పం ప్రజలకు ఒరిగిందేమిటి..? వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగాయా.. లేదా అన్నది ముఖ్యం. 
 
10. కుప్పం రుణం తీర్చుకుంటే.. చంద్రబాబును ఎందుకు అక్కడి ప్రజలు ఘోరంగా ఓడిస్తారు. ఈనాడు లాంటి పత్రికలు క్రేన్ లు తీసుకువచ్చి చంద్రబాబును రాజకీయంగా పైకి లేపాలని చూసినా.. లేపలేరు. 
 
11. జగన్ మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజల్లో సంపూర్ణ విశ్వాసం ఉంది. ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డిగారు ఏ కార్యక్రమం చేసినా చిత్తశుద్ధితో, అంకితభావంతో చేస్తారు. అందుకే ప్రజలు జగన్ మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తున్నారు. ఆయనకు పట్టం కడుతున్నారు. 
 
12. అమరావతి రాజధానిలోని 29 గ్రామాల మీద చంద్రబాబుకు ఉన్న ప్రేమ రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలపై లేదు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా అభివృద్ధి చేస్తాం అంటే చంద్రబాబు నోరు పెగలదు. ప్రభుత్వ విధానం ప్రకారం విశాఖను పరిపాలన రాజధానిగా,  అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును జ్యుడీషియల్ రాజధానిగా తీర్చిదిద్దుతాం. త్వరలోనే ఇవన్నీ జరుగుతాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు