చంద్రబాబూ! ఒక్కసారి కళ్లు తెరిచి చూడు: శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం

శుక్రవారం, 5 జూన్ 2020 (22:45 IST)
"చంద్రబాబూ...ఒక్కసారి కళ్లు తెరిచి చూడు. ఈ విధంగా ప్రపంచంలోగాని, దేశంలోగాని ఎక్కడైనా జరిగిందా అనేది చూసుకుని మాట్లాడండి. ముఖ్యంగా ఎస్సిఎస్టిబిసి మైనారిటీలందరికి ఈ సంక్షేమపధకాలు అందాయి. ఇది బడుగుబలహీనవర్గాల ప్రభుత్వం అని నిరూపించుకుంది" అని ప్రభుత్వ ఛీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ... "రాష్ర్టంలో జగనన్న పాలనలో ఈ ఏడాది మంచివర్షాలు పడి, ప్రభుత్వం రైతులకు ఏవైతే ప్రాధాన్యత ఇస్తుందో వాటి వల్ల రైతులకు మేలు జరిగి రాష్ర్టం సుభిక్షంగా,రైతుకు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.
 
ఐపోయిన పెళ్లికి మేళాలు అన్నట్లు చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఏమీ చేయలేక ప్రజలచే తిరస్కరించబడ్డాడు. కేవలం 23 సీట్లు ఇచ్చి చంద్రబాబు అరాచకాలు,ప్రజావ్యతిరేకపాలన మాకొద్దు అని చెప్పారు.
 
కాని చంద్రబాబు మాత్రం ఐదేళ్లు తాను గొప్ప పాలన అందించినట్లు మాట్లాడుతుండటం హాస్యాస్పదంగా ఉంది. తన ఫెయిల్యూర్స్ గురించి,ప్రజలకు ఎందుకు సరైన పాలన అందించలేకపోయానా అని ఆత్మవిమర్శ చేసుకోవడం మానేసి జూమ్ యాప్ లలో అడ్డగోలుగా మాట్లాడుతున్నారు.  
 
జగన్ పాలన, ఆయనకు లభిస్తున్న ప్రజాదరణ చూసి కడుపుమంటతో ట్వీట్లు,జూమ్ లలో విమర్శలు చేస్తున్నారు. కరోనా కారణంగా ప్రజలకేదైనా మంచిచేయాలనే ఆలోచన మాని హైద్రాబాద్ లో కోట్లాది రూపాయలతో కట్టుకున్న ఇంధ్రభవనంలో కూర్చున్నాడు.

తన కుమారుడుని పక్కన పెట్టుకుని జూమ్ యాప్ లతో కాలక్షేపం చేస్తూ తన శేషజీవితం ఎలా ఉండబోతుందోనని భయపడ్డాడు. వైయస్ జగన్ ప్రభుత్వం ఏడాది కాలంలో షుమారు నాలుగుకోట్ల మందికి నలభైవేల కోట్ల రూపాయలకుపైగా ప్రజల ఖాతాలలో వేసింది. కులాలు,మతాలు,పార్టీలకతీతంగా ప్రజలకు సంక్షేమ పధకాలు అందించారు.
 
విధ్వంసపాలన అంటే రైతులనుంచి వేల ఎకరాల భూములు లాక్కుని వేల ఎకరాలు దోపిడీ చేయడం. జన్మభూమి కమిటీలు పెట్టి రేషన్ కార్డులు, పెన్సన్ కావాలన్నా పేదలను బెదిరించి అరాచకాలు సాగించారు అది విధ్వంసపాలన అంటే. 
 
మట్టి, ఇసుక, బొగ్గు, మైనింగ్ ఇలా పంచభూతాలను ఐదేళ్లు దోచుకున్నారే అది విధ్వంసం అంటే. ఊరూరా బెల్ట్ షాపులు... పాన్ షాపులలో కూడా పెట్టి మద్యం అమ్మించి మహిళలు, పేదప్రజల జీవితాలతో ఆడుకున్నావే, అది విధ్వంసం అంటే.
 
విధ్వంసం అంటే.....రాష్ర్ట ప్రజలను తాకట్టుపెట్టి అమరావతి నుంచి ఢిల్లీవరకు హవాలా స్కామ్ చేయడం.పక్కరాష్ర్టంలో ఎంఎల్ఏలు,ఎంఎల్సిలను కొనడానికి ఓటుకు నోటురూ పంలో కోట్లాదిరూపాయలు ఇవ్వడం, ఇసుక దోపిడీని అడ్డుకున్న మహిళా అధికారిని చింతమనేని ప్రభాకర్ ఇసుకలో వేసి చంపడానికి ప్రయత్నం చేయడం.

జెర్రిపోతులపాలంలో దళిత మహిళను వివస్ర్తను చేసి టిడిపి నేతలు కొట్టడం, గోదావరి పుష్కరాలలో 29 మందిని నిర్ధాక్ష్యణ్యంగా తొక్కి చంపడం, మహిళలను కాల్ మనీ సెక్స్ రాకెట్ పేరుతో వారి జీవితాలతో ఆడుకోవడం.
 
బిసిలను ఓటుబ్యాంకుగా వాడుకుని వారికి కేవలం ఇస్ర్తీపెట్టలు, నాలుగుకత్తెర్లు ఇచ్చి సరిపుచ్చి అదే బిసిల అభివృద్ది అని చెప్పిన వ్యక్తివి నీవు.మా పాలన అలా కాదు.
 
మా పాలన... పేదప్రజల, బడుగు, బలహీనవర్గాల పాలన. ఏడాదికాలంలోనే దేశం అంతా మెచ్చుకునే విధంగా వైయస్ జగన్ పాలన సాగించారు.సర్వేలలో సైతం జగన్ గొప్ప ముఖ్యమంత్రిగా పేరుతెచ్చుకున్న విషయం మనం చూస్తున్నాం.
 
తను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఇది చంద్రబాబు పధకం అని చెప్పుకునేందుకు ఒక్క పధకాన్ని కూడా అమలు చేయలేదు. ఇది ఆయన సిగ్గుపడాల్సిన విషయం.
 
జగన్ రైతుభరోసా కింద ఏడాదిలో రెండువిడతలుగా పదివేలకోట్లు జమ చేశారు. అమ్మఒడి, విద్యాదీవెన, వసతిదీవెన పధకాలు అమలు చేస్తున్నారు. నాడునేడు కింద విద్యావ్యవస్ధ సంస్కరించేందుకు వేలకోట్లతో జగన్ పధకాలను రూపకల్పన చేశారు.

రాష్ర్టంలోని పిల్లలు విద్యాధికులు అయితే అదే మనకు గొప్పఆస్ది అని జగన్  ప్రకటించారు. చంద్రబాబూ...ఇలాంటి ఆలోచన ఎప్పుడైనా నీకు వచ్చిందా...
 
అదే రకంగా ఆటోసోదరులకు వాహనమిత్ర రెండుసార్లు అమలు చేశారు. నేతన్ననేస్తం అమలు చేశారు. రజకులకు నాయిబ్రాహ్మణులకు,టైలర్లకు పదివేల రూపాయల ఆర్ధికసహాయం చేశారు.

సున్నావడ్డీ,లానేస్తం,పెన్సన్లు,మత్స్యకారులకు భరోసా,కంటివెలుగు వంటి పధకాల ద్వారా  ఏడాదిలోనే  వైయస్ జగన్ గొప్పపాలన అందించారు.
 
ఛాలెంజ్ చేస్తున్నాను....మీలాగా పలానావారిని పధకాలనుంచి తీసేయండి అని మేం చెప్పడం లేదు.నీ పాలనలో లాగా మా వాళ్లకు, మా తెలుగుదేశం పార్టీ వారికి మాత్రమే పధకాలు ఇస్తామని చెప్పిన దౌర్భాగ్యపరిస్దితి లేదు.
 
విమర్శలు చేయాలని చంద్రబాబు అవాకులు చెవాకులు పేలుతున్నారు. అవినీతిని అంతం చేయాలని రివర్స్ టెండరింగ్ విధానం తెచ్చిన ప్రభుత్వం ఇది. నీ హయాంలో అన్నిరంగాలలో దోచుకుతిన్నావు. రాష్ర్ట ప్రజల డబ్బులను కాపలాదారుడి మాదిరిగా జగన్ కాపాడుతున్నారు. 
 
రాష్ర్టంలో అరాచకాలు చేస్తున్నాపని అంటావా...మహిళలను ఘోరంగా అవమానించిన మీరా ఇలా మాట్లాడేది. జగన్ ఏ రోజూ కూడా అరాచకాలకు తావివ్వరు. ఎవరు తప్పుచేసినా వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.
 
నా నియోజకవర్గంలో  వైయస్ జగన్ పధకాల వల్ల మహిళలు, రైతులు, వృధ్దులు,విద్యార్ధులు, నిరుద్యోగులు ఎంత సంతోషంగా ఉన్నారో చూస్తే అర్ధమవుతుంది.
 
చంద్రబాబూ...నీకు ధైర్యం ఉంటే ఈ సవాల్ స్వీకరించు...కుప్పం నియోజకవర్గానికి నీ కుమారుడు లోకేష్ ను పంపించు.....నేను వస్తాను. ఎంతమందికి జగన్ పధకాల వల్ల మేలు కలిగిందో అడుగుదాం.నీ హయాంలో నీవు ఎన్ని ప్రయోజనాలు కలిగించావో అది కూడా అడుగుదాం.
 
మూడులక్షలకోట్లకు పైగా అప్పులు చేసి 40 వేల కోట్లకుపైగా కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ లో పెట్టి కేవలం వందకోట్ల ఖజానాను వదిలివెళ్లినా కూడా ఏడాది కాలంలో అనేక సంక్షేమకార్యక్రమాలను జగన్ అమలు చేశారు.
 
మా నాయకుడు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పాడో అది తూచ తప్పకుండా అమలు చేస్తున్నాడు. మేం చెబుతున్నాం....మా మేనిఫెస్టోను తీసుకువెళ్లి మేం చెప్పినవి ఏమి చేయలేకపోయామో చెప్పండని అడగబోతున్నాం.మా పార్టీ మేనిఫెస్టో కాపీలను మీ కార్యకర్తలకు ఇస్తాం....మీరే ఇల్లిల్లు తిప్పండి. ఆ ధైర్యం నీకు లేదు.
 
ఎంతసేపటికి మీడియాలో ఎలా కనపడాలి,వ్యవస్ధలను ఎలా మేనేజ్ చేయాలా అని చూస్తావు.ఎన్నికల కమీషనర్ అనేది గొప్ప వ్యవస్ధ.ఆ వ్యవస్ధ కంటే రమేష్ కుమారే గొప్ప అని చంద్రబాబు అంటారు.ఆయన ఆదేశాలతో ఆయనకు కావాల్సిన ఎస్పి,కలెక్టర్లతో ఆయన పాలన సాగించాలని భావిస్తారు.
 
ఓడిపోయి సిగ్గులేకుండా అధికారులందర్ని గుప్పిట్లో పెట్టుకోవాలనే ప్రయత్నాలు చంద్రబాబు చేస్తున్నారు.నీ జీవితమంతా మేనేజ్ మెంటే.
 
చంద్రబాబూ....నీకు ధైర్యం ఉంటే కుప్పం నుంచే స్టార్ట్ చేద్దాం రా.... ఎవరిది సంక్షేమ ప్రభుత్వమో...ఎవరిది విధ్వంసకర పాలనో ప్రజలదగ్గరకు వెళ్లి విందాం.గ్రౌండ్ రియలిటీని తెలుసుకోకుండా హైద్రాబాద్ లో కూర్చుని మాట్లాడతావు.మొన్న వచ్చి మహానాడు గురించి మాట్లాడుకుని వందలకార్ల ర్యాలీతో తిరిగి ఇంటికి చేరుకున్నావు. 
 
మీకు ప్రజలు ఎన్నికలలో గుణపాఠం చెప్పారు.భవిష్యత్తులో మీ పార్టీ నామరూపాలులేకుండా పోతుంది.త్వరలో తెలుగుదేశం పార్టీకి గుర్తింపు కూడా రద్దవుతుంది .ఇలాంటి ప్రవర్తన చేస్తే ప్రజలు మీ గుర్తింపునే రద్దు చేస్తారు" అని వ్యాఖ్యానించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు