రెండురోజులు పోతే జగన్ అది చేతిలో పట్టుకుని తిరుగుతాడు: చంద్రబాబు

శనివారం, 20 ఏప్రియల్ 2019 (21:57 IST)
ఫలితాలు రాకముందే వై.ఎస్.జగన్ సిఎం అని రాసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు టిడిపి జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పోలింగ్ తరువాత తెగ హడావిడి చేసిన నేతలు ఆ తరువాత ఎందుకు కనిపించకుండా పోయారని ప్రశ్నించారాయన. రెండురోజులు పోతే జగన్ అదే బోర్డు చేతిలో పట్టుకుని తిరుగుతాడని ఎద్దేవా చేశారు.
 
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న తన పిలుపుతో ఓటర్లు పోలింగ్ బూత్‌లకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు. ఎన్నికల కమిషన్ అవలంభించే విధానంపైన తన పోరాటం కొనసాగుతూ ఉంటుందన్నారు. మోడీ హెలికాప్టర్‌ను ఫోటో తీస్తే ఒక ఐఎఎస్ అధికారిని సస్పెండ్ చేయడమేంటని ప్రశ్నించారు.
 
మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారి హెలికాప్టర్లు మాత్రం తనిఖీలు చేయిస్తారా అని మండిపడ్డారు. వి.వి.ప్యాట్లో ఉన్న స్లిప్పులు మొత్తాన్ని లెక్కించాలన్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలే కాకుండా దేశంలో మోడీని ప్రశ్నించే అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తానని తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో చంద్రబాబు తెలిపారు.
 
తిరుపతిలో ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్‌ను ప్రారంభించిన చంద్రబాబు
తిరుపతిలోని కోటకొమ్మలవీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్‌ను ప్రారంభించారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి. హైదరాబాద్, వైజాగ్, గుంటూరు జిల్లాల తరువాత నాలుగో బ్లడ్ బ్యాంకు తిరుపతిలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు నారా చంద్రబాబునాయుడు.
 
అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా 5 వేల మందిని చదివించామని, హెల్త్ క్యాంప్‌లను నిర్వహించామని చెప్పారు. శక్తివంతమైన ఆర్గనైజేషన్‌గా ఎన్టీఆర్ ట్రస్ట్ మారిందని, సేవా భావంతో ఎన్టీఆర్ ట్రస్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారని చెప్పారు. ఎపిలో ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్‌ది బెస్ట్‌గా నిలుస్తుందన్నారు చంద్రబాబునాయుడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు