శాంతియుత సహజీవనమే క్రిస్మస్ సందేశం: బిశ్వ భూషణ్ హరిచందన్

సోమవారం, 23 డిశెంబరు 2019 (20:24 IST)
మానవత్వమే మతం కావాలని, లౌకిక భారతదేశంలో అన్ని కులాలు మతాలు ఒక్కటేనని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ అన్నారు. ఏసుక్రీస్తు జననానికి గుర్తుగా జరుపుకునే క్రిస్మస్ పర్వదినం నేపధ్యంలో నమ్మికగొన్న వారి ఇంట సుఖశాంతులు వెల్లివిరియాలని గవర్నర్ అన్నారు. రాజ్ భవన్ వేదికగా సోమవారం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. 
 
రాజ్ భవన్ క్రిస్మస్ దీపకాంతులతో ప్రత్యేక వెలుగును సంతరించుకుంది. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఏ మతం అయినా విశ్వ శాంతినే కోరుతుందన్నారు. శాంతియుత స‌హ‌జీవ‌న‌మే క్రిస్మ‌స్ సందేశం కాగా, స‌క‌ల జ‌నులూ సంయ‌మ‌నంతో క‌లిసిమెలిసి ఉండాల‌న్న క్రీస్తు బోధ‌న‌లు మాన‌వాళికి ఆచరణీయమని బిశ్వ భూషణ్ అన్నారు. 
 
క్రిస్మ‌స్ ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్త‌వులంద‌రికీ క్రిస్మ‌స్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక ప్రార్ధనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్రంలోని క్రిస్టియన్ సంఘాల తరపున హాజరైన మత పెద్దలు గవర్నర్ బిశ్వ భూషణ్‌కు ఆశీర్వాదం అందించారు. 
 
కార్యక్రమంలో గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, సంయుక్త కార్యదర్శి అర్జునవారు, రాష్ట్ర ప్రోటోకాల్ విభాగపు సంచాలకులు జిసి కిషోర్ కుమార్ పాల్గొన్నారు. కార్యక్రమంలో క్రిస్టియన్ మత గురువులు బిషప్ మోస్ట్ రెవరెండ్ డాక్డర్ రాజారావు, రైట్ రెవరెండ్ డాక్టర్ జార్జి కొర్నేలియస్, మోస్ట్ రెవరెండ్ డాక్టర్ ఫెడ్రిక్ పరదేశి బాబు, రెవరెండ్ ఇబెంజర్, రెవరెండ్ విశ్వ ప్రసాద్, రెవరెండ్ ఏలియా కొడాలి, రెవరెండ్ నక్కా జాన్ బాబు, రెవరెండ్ జాన్ దేవదాస్, రెవరెండ్ దేవరాజ్, ఇందుపల్లి కరుణానిధి తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు