బస్సులు నడుస్తాయ్.. కానీ ప్రయాణీకులు అలా చేయాలట.. పల్లె వెలుగులో నో కండెక్టర్

శుక్రవారం, 15 మే 2020 (10:29 IST)
Bus
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 18వ తేదీ నుంచి నాలుగో దశ లాక్‌డౌన్ అమలు కానుంది. నాలుగో దశ లాక్‌డౌన్ కొత్త రూపంలో ఉంటుందని ఇటీవల ప్రధాని మోదీ వెల్లడించారు. కానీ కొన్ని రాష్ట్రాలు హాట్‌స్పాట్ కాని జోన్లలో లోకల్ బస్సులు నడిపే అవకాశాలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం. 
 
ఇందులో భాగంగా ఆటోలు, ట్యాక్సీలను కూడా ప్రయాణికుల సంఖ్యను కుదించి నడపనున్నారు. నాన్ కంటేన్మెంట్ జోన్లు ఉన్న జిల్లాల్లో ఈ బస్సు నడవనున్నాయి. అంతరాష్ట్ర బస్సు సర్వీసులను కూడా కేంద్రం పచ్చజెండా ఊపే అవకాశాలు ఉన్నాయి. అయితే ట్రావెల్ పాసులు ఉన్నవారు మాత్రమే మరో రాష్ట్రానికి బస్సు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వచ్చేవారం నుంచి దేశీయ విమాన సర్వీసులను కూడా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
 
మరోవైపు.. సుదీర్ఘ విరామం తరువాత ఈ నెల 18 నుంచి బస్సులు నడిపేందుకు పీటీడీ విశాఖ రీజియన్‌ యాజమాన్యం సిద్ధమవుతుంది. ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన వెంటనే బస్సులను రోడ్డెక్కించడానికి సన్నద్ధం అవుతోంది. 
 
కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రయాణికుల మధ్య భౌతిక దూరం వుండేలా బస్సుల సీటింగ్‌లో మార్పులు, చేర్పులు చేస్తోంది. అదేవిధంగా ప్రయాణికులు చేతులు శుభ్రం చేసుకోవడానికి శానిటైజర్‌, లిక్విడ్‌ హ్యాండ్‌ వాష్‌ అందుబాటులో ఉంచనున్నది. 
 
కానీ పల్లె వెలుగు బస్సుల్లో సీట్లను మార్చడం లేదు. అయితే 50 సీట్లకుగాను 30 సీట్లలో మాత్రమే ప్రయాణికులు కూర్చోవాలి. ఈ మేరకు ఆయా బస్సుల్లో మార్కింగ్‌ చేయిస్తున్నారు. బస్సుల్లో నిల్చుని ప్రయాణించడానికి అనుమతించరు. 
 
పల్లె వెలుగు బస్సుల్లో కండక్టర్లు ఉండరు. డ్రైవర్ల వద్ద టిమ్స్‌ ఉంటాయి. బస్టాండ్‌లో బస్సు ఎక్కే ముందే అక్కడ వుండే సిబ్బంది టిమ్స్‌తో టిక్కెట్లు జారీచేస్తారు. గతంలో మాదిరిగా అన్ని స్టాపుల్లో ఆపరు. లిమిటెడ్‌ హాల్ట్స్‌ మాత్రమే ఉంటాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు