21 నుంచి వంద శాతం సిబ్బందితో ఏపీ సర్కారు ఆఫీసుల్లో విధులు

బుధవారం, 20 మే 2020 (14:32 IST)
కరోనా లాక్డౌన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభంకానున్నాయి. అదీ కూడా వంద శాతం మంది సిబ్బందితో ఈ ఆఫీసులన్నీ తిరిగి పని చేయనున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు వీలుగా మార్చి 25వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతోంది. దీంతో అన్ని ప్రభుత్వ కార్యాలయాలను మూసివేశారు. 
 
అయితే, ఇపుడు కేంద్రం లాక్డౌన్ సడలింపులు ఇచ్చింది. దీంతో పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ కార్యాలయాలు తెరుస్తున్నారు. అదేబాటలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ప్రభుత్వ కార్యాలయాలు పూర్తిగా వందశాతం సిబ్బందితో పని చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే, కంటైన్మెంట్ ప్రాంతాల్లో మాత్రం ఈ కార్యాలయాలను మూసివేసివుంచుతారు
 
ఈ మేరకు ప్రభుత్వ కార్యాలయాల్లో విధుల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఉద్యోగులు వందశాతం విధులకు హాజరుకావాల్సిందేనని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. సచివాలయం సహా అన్ని ప్రభుత్వ విభాగాలు, విభాగాధిపతులు, జిల్లా కార్యాలయాలు 21 నుంచి వందశాతం సిబ్బందితో విధులు ప్రారంభించాలని స్పష్టం చేశారు. 
 
కంటైన్మెంట్‌ ప్రాంతాలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు పాటిస్తూనే విధులకు హాజరు కావాలని ఉద్యోగులకు సూచించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీలు, ప్రిన్సిపల్‌ సెక్రటరీలు, సెక్రటరీలు, విభాగాధిపతులు, కలెక్టర్లు, ఆఫీస్‌ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు