ఇక నుంచి ఏపీలో రైతులకే సున్నా వడ్డీ ప్రయోజనం

గురువారం, 9 జులై 2020 (10:00 IST)
వైయస్సార్‌ జయంతి సందర్భంగా రైతు దినోత్సవం నిర్వహిస్తున్న ప్రభుత్వం పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ, ఒక మనిషి నిజంగా రైతుల గురించి ఆలోచించి, వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడా అని చూసి ఆ గౌరవ మర్యాదలు ఇస్తారని, రైతుల పట్ల మంచి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అంటే నాన్న పేరు గొప్పగా కనిపిస్తుందని చెప్పారు.
 
వైయస్సార్‌–వ్యవసాయం
రాష్ట్రంలో 62 శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడ్డారన్న ముఖ్యమంత్రి, 2004లో వైయస్సార్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు రూ.1200 కోట్ల విద్యుత్‌ బిల్లుల రద్దుతో పాటు, రైతులకు ఉచిత విద్యుత్‌ ఇచ్చే ఫైలు మీద తొలి సంతకం చేశారని గుర్తు చేశారు. దీని వల్ల రైతులకు ఏటా రూ.50 వేల ప్రయోజనం కలుగుతోందని చెప్పారు. ‘సాధారణంగా రైతులు 7.5 హెచ్‌పీ మోటరు వాడతారు.

అంటే దాదాపు 5 కిలోవాట్‌ మోటరు. అంటే గంటకు 5 యూనిట్లు. రోజుకు 7 నుంచి 9 గంటలు వేసుకున్నా రోజుకు 35 నుంచి 45 యూనిట్లు. ఏటా కనీసం 150 రోజులు లెక్క వేసుకుంటే.. ఇవాళ మనకు యూనిట్‌ విద్యుత్‌కు రూ.6.87 చొపున లెక్కిస్తే, రైతులకు ఏటా రూ.50 వేలు మేలు జరుగుతోంది. అందుకు ప్రధాన కారణం నాన్న తీసుకున్న నిర్ణయం’ అని సీఎం  వైయస్‌ జగన్‌ వివరించారు.

2004 ఎన్నికల ముందు రైతులకు ఉచిత విద్యుత్‌ అంటే చంద్రబాబు చులకన చేశారని, రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తే, బట్టలు ఆరేసుకోవడానికి తప్ప విద్యుత్‌ తీగలు పనికి రావన్నారని గుర్తు చేశారు. కానీ ఆ తర్వాత దాన్ని నాడు వైయస్సార్‌ అమలు చేసి చూపారని, ఇవాళ్టికి రైతుల జీవితాల్లో గుర్తుండిపోయే ఘట్టం అది అని చెప్పారు. ఒక్క ఉచిత విద్యుత్‌ మాత్రమే కాకుండా, ఆరోగ్యశ్రీ. 108, 104 సర్వీసులు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌. జలయజ్ఞం అన్నీ గుర్తుకు వస్తాయని చెప్పారు.
 
రూ.1150 కోట్ల వడ్డీ బకాయిల చెల్లింపు
రైతుల సకాలంలో వ్యవసాయ రుణాలు సకాలంలో చెల్లిస్తే, వారికి వడ్డీ వేయకూడదని, కానీ గత ప్రభుత్వం ఆ కార్యక్రమానికి గ్రహణం పట్టించిందని, దాదాపు 57 లక్షల రైతులకు రూ.1150 కోట్లు బకాయి పెట్టిందని సీఎం తెలిపారు. ఆ బాధ్యతను గత ప్రభుత్వం మర్చిపోయిందన్న ఆయన, ఇప్పుడు ఆ మొత్తాన్ని నేరుగా ప్రభుత్వం చెల్లిస్తోందని, రైతుల ఖాతాల్లో జమ చేస్తోందని చెప్పారు.

‘రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేయాలని గత ప్రభుత్వం ఏనాడూ సీరియస్‌గా తీసుకోలేదు. రైతులను మోసం చేసింది. ఇప్పుడు మేము వాటిని పూర్తిగా చెల్లిస్తున్నాం. రైతులకు సున్నా వడ్డీ పథకంలో ఏ మాత్రం బకాయి లేకుండా పూర్తిగా చెల్లిస్తున్నాం. గతంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో పూర్తి బకాయిలు చెల్లించినట్లు, దీన్ని కూడా పూర్తిగా చెల్లిస్తున్నాం. రైతులు సకాలంలో రుణాలు చెల్లిస్తే, వారి వడ్డీ కట్టే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది. గత ప్రభుత్వం మాదిరిగా ఎగ్గొట్టకుండా పూర్తిగా ఇస్తున్నాం

ఆ మొత్తం కూడా బ్యాంకులకు నేరుగా చెల్లించకుండా, ఆ మొత్తాన్ని రైతుల ఖాతాల్లోనే వేస్తున్నాం. ఈ బాధ్యత తీసుకుంటూ దాదాపు రూ.1150 కోట్లు నేరుగా 57 లక్షల రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాం’ అని ముఖ్యమంత్రి వివరించారు.
 
అవి మాత్రమే కాకుండా 2019–20కి సంబంధించి రైతులు ఖరీఫ్, రబీలో తీసుకున్న రుణాలకు సంబంధించి, ఆ సీజన్లు పూర్తయ్యే నాటికివ నేరుగా వారి ఖాతాల్లోనే వడ్డీ మొత్తం జమ చేస్తామని సీఎం ప్రకటించారు.

ఆ మేరకు ఈ ఏడాది అక్టోబరు, వచ్చే ఏడాది మార్చి నెలలో రైతులకు వడ్డీ మొత్తాన్ని వారి వారి ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు. 
 
వెంటనే ఆందోళన వద్దు
ఇప్పుడు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న రూ.1150 కోట్ల వడ్డీ మొత్తం గత ప్రభుత్వం బకాయి పెట్టినవన్న ముఖ్యమంత్రి, అవి అంతకు ముందు ఏడాదికి చెందిన రుణాలకు సంబంధించినవి కాబట్టి, ఇవాళ బటన్‌ నొక్కిన వెంటనే అందరు రైతుల ఖాతాల్లో జమ కాకపోతే, కంగారు పడవద్దని చెప్పారు. నాలుగు రోజులు బ్యాంకులకు సమయం ఇవ్వాలని, అప్పటికి సమస్య పరిష్కారం కాకపోతే కాల్‌ సెంటర్‌ నెంబరు 1097 కు ఫోన్‌ చేయాలని కోరారు.
 
ఫామ్‌ మెకనైజేషన్‌
రైతులకు సాగులో ఉపయోగపడే యంత్రాలు నేరుగా రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బీకే) పరిధిలోకి తీసుకువస్తున్నామని, అవి అవసరమైన రైతులు ఆర్‌బీకేలను సంప్రదిస్తే, తక్కువ వ్యయానికే అవి పొందవచ్చని తెలిపారు. దాదాపు రూ.1572 కోట్ల వ్యయంతో యంత్రాలు సేకరిస్తున్నామని చెప్పారు.
 
పశువులు–కృత్రిమ గర్భధారణ
పశు సంవర్థక శాఖ రైతు భరోసా కేంద్రాల ద్వారా శాచురేషన్‌ పద్ధతిలో పశువులకు పూర్తి వైద్య సేవలందించడంతో పాటు, లక్షలాది పశువులకు కృత్రిమ గర్భధారణ చేస్తుందని ముఖ్యమంత్రి వెల్లడించారు.
 
చెరకు రైతుల బకాయిల చెల్లింపు
సహకార రంగంలోని చక్కెర ఫ్యాక్టరీల పరిధిలో రైతులకు గత ప్రభుత్వం దాదాపు రూ.88 కోట్లు బకాయి పెట్టిందని, దానికి సంబంధించి కొన్నాళ్ల క్రితం రూ.34 కోట్లు ఇచ్చామని సీఎం తెలిపారు. కాగా ఇవాళ రూ.54 కోట్లు ఇచ్చి, 5 ఫ్యాక్టరీల పరిధిలోని చెరుకు రైతుల మొత్తం బకాయిలు చెల్లిస్తున్నామని, దీని వల్ల దాదాపు 36 వేల రైతులకు లబ్ధి కలుగుతుందని చెప్పారు.
 
ఫిషింగ్‌ హార్బర్లు–ఎంఓయూ
మత్స్యకారులు ఉపాధి వెతుక్కుంటూ వలస పోతున్నారని, ఆ పరిస్థితి మార్చడం కోసం దాదాపు రూ.2800 కోట్ల వ్యయంతో 8 ఫిషింగ్‌ హార్బర్లు. 4 ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్ల ఏర్పాటు చేస్తున్నామని సీఎం వైయస్‌ జగన్‌ వెల్లడించారు. 
 
వాటిలో జువ్వలదిన్నెకు సంబంధించి ఇటీవలే కేంద్రం, నాబార్డుతో ఒప్పందం చేసుకున్నామన్న ఆయన, ఇవాళ నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్‌ హార్బర్లకు నాబార్డ్‌ ఆర్థిక సహాయం అందించనుందని, ఆ మేరకు కేంద్రం, నాబార్డుతో రూ.1000 కోట్లతో ఒప్పందం చేసుకుంటున్నామని చెప్పారు. 8 ఫిఫింగ్‌ హార్బర్లలో 4 ఫిషింగ్‌ హార్బర్ల పనులు రూ.1300 కోట్లతో పనులు మొదలు పెడుతున్నామని వివరించారు.
 
గత 13 నెలల్లో..
‘రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. గత 13 నెలలుగా ఈ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వంగా పని చేసిందని చెబుతున్నాను. దేవుడి దయ, అందరి దీవెనలతో చాలా పనులు చేశాను’ అన్న సీఎం వైయస్‌ జగన్‌ వాటన్నింటినీ వివరించారు.

– వైయస్సార్‌ రైతు భరోసా. రైతులకు దాదాపు రూ.10,242 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో వేశాము. ఏటా రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయంగా ఇచ్చాం.
– 10641 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు.
– రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చేలా రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు.
– కనీస ధర ప్రకటించని వ్యవసాయ ఉత్పత్తులు, త్వరగా చెడిపోయే టమోటా, బొప్పాయితో పాటు, పొగాకు కూడా ఇవాళ రైతుల నుంచి కొంటున్నాం.
– రూ.8655 కోట్ల వ్యవసాయ విద్యుత్‌ బకాయిలు, గత ప్రభుత్వం బకాయి పెడితే, అవి కూడా ఇచ్చాం.
– వడ్డీ లేని రుణాలకు గానూ రూ.1150 కోట్లు చెల్లిస్తున్నాం.
– ధాన్యం సేకరణకు సంబంధించి రూ.960 కోట్లు బకాయి పెడితే అవి కూడా ఇచ్చాం.
– రూ.384 కోట్లు విత్తనాల బకాయిలు కూడా చెల్లించాం.
– 2018–19కి సంబంధించి గత ప్రభుత్వం రబీలో పంటల బీమా ప్రీమియమ్‌ కట్టకపోతే రూ.122.16 కోట్లు కట్టాం. బీమా కంపెనీలతో మాట్లాడి రైతులకు రూ.596 కోట్ల బీమా పరిహారం రైతులకు అందించాం. 
– రైతులకు పగలే నాణ్యమైన విద్యుత్‌ 83 శాతం ఫీడర్లలో ఇస్తుండగా, రబీ నాటికి మిగిలిన ఫీడర్ల కింద కూడా ఇచ్చేందుకు రూ.1700 కోట్లు ఖర్చు చేస్తున్నాం
– దేశ చరిత్రలోనే తొలిసారిగా పంటల బీమా సొమ్ములో రైతుల వాటాను కడుతున్నాం. రైతుల వాటాగా రూ.690 కోట్లు, ప్రభుత్వ వాటాగా రూ.766 కోట్లు.. మొత్తం రూ.1456 కోట్లు పంటల బీమా కింద కట్టాం.
– ఆక్వా రైతులకు కరెంటు యూనిట్‌ రూ.1.50 కే ఇస్తూ, దాదాపు రూ.700 కోట్లు సబ్సిడీ.
– రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి. రూ.2 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధి.
– రూ.2753 కోట్లు ఖర్చు చేసి, కరోనా సమయంలో రైతులకు మేలు చేయడం కోసం దాదాపు 8.25 లక్షల మెట్రిక్‌ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం పలు ఉత్పత్తులు కొనుగోలు చేసింది.
– శనగ రైతులకు రూ.300 కోట్లు ఇచ్చి ఆదుకున్నాం. అది కూడా కలుపుకుంటే రూ.3050 కోట్లతో కొనుగోలు చేసి రైతులకు తోడుగా ఉన్నాం.
– అరటి, టమోటా కూడా కొన్నాం.
– 191 నుంచి 216 మార్కెట్‌ యార్డుల పెంపు.
– వ్యవసాయ ట్రాక్టర్లకు రహదారి పన్ను రద్దు.
– ఆత్మహత్య చేసుకున్న రైతులకు వైయస్సార్‌ బీమా ద్వారా రూ.7 లక్షల సహాయం
– గత ప్రభుత్వ హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో 417 కుటుంబాలకు అండగా ఉంటూ రూ.20.85 కోట్లు ఇచ్చాం
– వ్యవసాయ మిషన్‌ ఏర్పాటు చేశాం.
– కౌలు రైతులతో పాటు, ఆలయ భూములు, పోడు భూములు సాగు చేస్తున్న రైతులకు కూడా రైతు భరోసా పథకం అమలు చేశాం.
– ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్‌ ఫోన్‌ నెంబరు.155251 ఏర్పాటు చేశాం.
 
అధిక ఆహార ధాన్యాలు
వీటన్నింటి వల్ల ఈ ఏడాది ఏకంగా 180.54 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగిందన్న ముఖ్యమంత్రి, గత ఏడాది కేవలం 150 లక్షల టన్నుల ఉత్పత్తి మాత్రమే జరిగిందని తెలిపారు.

ఇవే కాకుండా జలయజ్ఞంలో భాగంగా ప్రాజెక్టు పనులు పరుగెత్తిస్తున్నామని, ఈ ఏడాది 6 ప్రాజెక్టులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు.

దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో ఇంకా మంచి పనులు చేయాలని ఆకాంక్షిస్తున్నానంటూ సీఎం వైయస్‌ జగన్‌ తన ప్రసంగం ముగించారు.
 
మూడు వ్యవసాయ యంత్ర శిక్షణ కేంద్రాలను ఆన్‌లైన్లో శిలాఫలకాలు ఆవిష్కరించిన సీఎం  వైయస్‌.జగన్‌:
వ్యవసాయ యాంత్రీకరణ చర్యలలో భాగంగా చేపట్టిన మూడు శిక్షణ కేంద్రాలకు సీఎం  వైయస్‌ జగన్‌ ఆన్‌లైన్‌లో శిలా ఫలకాలు ఆవిష్కరించారు.

కర్నూలు జిల్లా తంగడంచ, తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట, శ్రీకాకుళం జిల్లా నైరాలో మూడు చోట్ల వ్యవసాయ యంత్ర శిక్షణ కేంద్రాల పనులను ఆయన ప్రారంభించారు. రూ.42 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న శిక్షణ కేంద్రాలలో ఏటా సుమారు 1500 మందికి శిక్షణ ఇస్తారు.
 
ఇంకా వైయస్సార్‌ సున్నా వడ్డీ కింద రుణాల సహాయం, వైయస్సార్‌ రైతు భరోసా, కౌలు రైతులకు మేలు విధంగా తీసుకువచ్చిన పంటసాగుదారు హక్కు పత్రం, వరిలో సరైన మోతాదుల్లో ఎరువుల వాడకం, సమగ్ర ఎరువుల యాజమాన్యం, రైతులకు ఉద్దేశించిన 155251 టోల్‌ ఫ్రీ నంబర్‌కు సంబంధించిన పోస్టర్లను కూడా సీఎం విడుదల చేశారు.
 
మాస పత్రిక ఆవిష్కరణ
రాష్ట్రంలోని రైతులకు ఆర్బీకేల ద్వారా వ్యవసాయం, దాని అనుబంధ రంగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలిపే ఉద్దేశ్యంతో వ్యవసాయశాఖ రూపొందించిన  డాక్టర్‌ వైయస్సార్‌ రైతు భరోసా మాసపత్రికను కూడా కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ ఆవిష్కరించారు.

పంటలసాగు మెళకువలు, ప్రభుత్వం చేపట్టనున్న వివిధ పథకాల వివరాలు, మార్కెట్‌ ధరలు, వాతావరణం తదితర వివరాలు ఆ పత్రికలో ఉంటాయి. చివరగా, ఆంధ్రప్రదేశ్‌ మత్స్యశాఖ రూపొందించిన మత్స్య సాగుబడి మార్గదర్శిని పుస్తకాన్ని కూడా సీఎం వైయస్‌.జగన్‌ ఆవిష్కరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు