అత్త సాయంతో భర్తను హత్య చేసిన భార్య.. అనుమానంతో మొండం నుంచి తలను..?

బుధవారం, 22 జులై 2020 (13:29 IST)
కరోనా కాలంలో నేరాల సంఖ్య పెరిగిపోతోంది. అన్ లాక్ ప్రక్రియ ప్రారంభమైనా.. చాలామంది ఉపాధి కోల్పోవడం ద్వారా ఇంటిపట్టునే వుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వివిధ కారణాలతో గొడవలు పడటం, క్షణికావేశంలోఆత్మహత్యలు, హత్యలు చేయడం వంటివి బాగా పెరిగిపోయింది. అత్తతో కలిసి ఓ భార్య తన భర్తను హత్య చేసింది. 
 
ఈ సంఘటన చిత్తూరు జిల్లాలోని పలమనేరు మండలంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే, పలమనేరు మండలంలోని నక్కపల్లి గ్రామానికి చెందిన లోకనాథ రెడ్డి అనే వ్యక్తి నిత్యం భార్యను హింసించేవాడు. భర్త హింసలు భరించలేక ఆ మహిళ తన అత్త సహాయంతో హత్య చేసింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
 
మరోవైపు భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో కత్తితో భార్య మెడను నరికి మొండెం నుంచి తలను వేరు చేశాడు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన శ్రీనివాసరావు ఎన్‌ఎస్పీ కెనాల్స్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. శ్రీనివాసరావు తన భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానం పెంచుకున్నాడు. ఈ అనుమానంతోనే భార్యతో తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలోనే రాత్రి ఒంటి గంట సమయంలో భార్యభర్తలిద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో శ్రీనివాసరావు భార్య పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు పోలీసు స్టేషన్‌కు బయలుదేరింది. దీంతో ఆగ్రహించిన శ్రీనివాసరావు తన భార్య ఎన్ఎస్పీ అతిథిగృహం వద్దకు చేరుకోగానే ఆమెను అడ్డగించాడు.
 
అయినా భార్య వినకుండా పోలీసు స్టేషన్‌కు వెళ్లేందుకు పట్టుబడింది. దీంతో మద్యం మత్తులో ఉన్న శ్రీనివాసరావు అప్పటికే తన వెంట తెచ్చుకున్న పదునైన కత్తితో ఆమెను నరికేశాడు. అనంతరం మొండెం నుంచి తలను వేరుచేశాడు. తలను తీసుకుని పోలీసు స్టేషన్‌కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు