పరవళ్లు తొక్కుతున్న పెన్నానది.. నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు

ఆదివారం, 20 సెప్టెంబరు 2020 (17:13 IST)
నెల్లూరు జిల్లాలోని పెన్నానది వరద నీటితో పరవళ్లు తొక్కుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగనున్నాయి. ఎగువున ఉన్న సోమశిల రిజర్వార్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఈ డ్యాం నుంచి నీటికి కిందికి విడుదల చేస్తుండటంతో పెన్నానది ఉగ్రరూపందాల్చి ప్రవహిస్తోంది. 
 
ఫలితంగా పెన్నా పరివాహక ప్రాంతాలు ముంపునకు గురికాగా, లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. సోమశిల జలాశయం నుంచి పెన్నాకు విడుదల అవుతున్న నీరు ఆదివారం సాయంత్రానికి మరింత పెరిగే అవకాశం ఉంది. సోమశిల జలాశయానికి ఇప్పటికే 1.42 లక్షల క్యూసెక్కుల వరద వస్తుంది. దీంతో జలాశయం లోని 12 గేట్లను ఎత్తి 1.56 లక్షల క్యూసెక్కుల నీటిని పెన్నాకు విడుదల చేస్తున్నారు. 
 
ఆదివారం సాయంత్రానికి మరో 50 వేల క్యూసెక్కులను కలిపి 2 లక్షల క్యూసెక్కుల నీటిని పెన్నాకు విడుదల చేసేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. ముంపు ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. ఇప్పటికే జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ ముంపు ప్రాంతాలను పరిశీలించారు. 
 
జిల్లా మంత్రి గౌతమ్ రెడ్డి సైతం అధికారులతో సమీక్ష నిర్వహించి ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నారు. రెవెన్యూ అధికారులు ముంపు ప్రాంతాల్లో పర్యటించి ముంపు వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో పెన్నానది ఈ తరహాలో ప్రవహించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు