నాకంటే నీకు ఎక్కువ జీతమా? అందుకే నువ్వు చావు... భార్యను చంపేసిన భర్త

మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (16:26 IST)
బెంగళూరులో జరిగిన ఓ సంఘటన అందరి చేత కంటతడి పెట్టిస్తోంది. భార్య తనకంటే ఎక్కువ జీతం తీస్తోందన్న విషయాన్ని సహించలేక ఆమెను దారుణంగా హతమార్చాడు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు పట్టణానికి చెందిన రావి ధనుంజయరావు, ధనలక్ష్మిల కుమార్తె జయమాధవి వివాహం విజయవాడకు చెందిన వెంకట సుబ్రహ్మణ్యంతో గత ఏడాది జరిగింది. 
 
వరకట్నం కింద జయమాధవి తండ్రి సుబ్రహ్మణ్యం కుటుంబానికి రూ.30 లక్షల డబ్బు, 30 తులాల బంగారం, ఆడపడచు లాంఛనాల కింద 2లక్షలు, అరకేజి వెండి ఇచ్చారు. ఈ ఇద్దరు బెంగళూరులోని వేర్వేరు సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. పెళ్లయిన మొదట్లో వీరి సంసారం సజావుగానే సాగింది. అయితే ఏమైందో ఏమో గానీ..సుబ్రహ్మణ్యం ప్రవర్తనలో మార్పు వచ్చింది.
 
జయమాధవి తనకంటే ఎక్కువ సంపాదిస్తుందనే ఈర్ష్యతో, అలాగే కట్నం కూడా తక్కువ తీసుకువచ్చిందని మనోవేదనతో ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే జయమాధవి ఇటీవలే గర్భవతి అయింది. ఈ విషయం తెలిసి సంతోషించాల్సిన భర్త అప్పటి నుండి ఆమెను మరింత వేధించసాగాడు. ఈ నేపథ్యంలో సుబ్రహ్మణ్యం శనివారం జయమాధవిని హత్య చేశాడు. 
 
విషయం తెలుసుకున్న జయమాధవి తల్లిదండ్రులు బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తెను చిత్రహింసలకు గురి చేసి, హత్య చేసినట్లు వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుబ్రహ్మణ్యంను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించింది. మరోపక్క ఇద్దరు నిందితులైన సుబ్రహ్మణ్యం తల్లి, సోదరి పరారీలో ఉన్నారు. 
 
పెళ్లైన నాలుగో రోజు అత్తారింటికి వెళ్లిన జయమాధవి.. అప్పటి నుంచి పుట్టింటికి తిరిగి రాలేదు. ఇప్పుడు రక్తపు ముద్దగా ఆమె మృతదేహం పుట్టింటికి చేరడంతో తల్లిదండ్రులతో పాటు బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు