తమ్ముడు ప్రేమ.. అన్న హత్యకు దారితీసింది.. ఎలా?

శుక్రవారం, 30 అక్టోబరు 2020 (12:04 IST)
హైదరాబాద్ నగరంలో ఓ హత్య జరిగింది. ఈ హత్యకు కారణం తమ్ముడు ప్రేమ. ఈ ప్రేమ కారణంగా అన్న దారుణ హత్యకు గురయ్యాడు. తమ్ముడు ప్రేమించిన యువతి కుటుంబ సభ్యులు అన్నను కత్తితో పొడిచి చంపేశారు. ఆ తర్వాత అన్నదమ్ములపై రివర్స్ కేసు పెట్టారు. కానీ పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గోషామహల్‌ చంద్రకిరణ్‌ బస్తీకి చెందిన తారయ్యకు కొండ్ర మధు(22), 17 వయసులో మరో కుమారుడు ఉన్నాడు. మధు జులాయిగా తిరుగుతుంటారు. ఓ చోరీ కేసులో కూడా ఆర్నెల్ల క్రితం పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవలే అతను బెయిల్‌పై విడుదలైవచ్చాడు. 
 
అయితే, మధు తమ్ముడు మాత్రం అదే బస్తీకి చెందిన ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయం యువతి తల్లిదండ్రులతోపాటు కుటుంబ సభ్యులకు తెలిసింది. యువతి తండ్రి ప్రకాష్ ‌(45), బాబాయ్‌లు శంకర్‌ (30), కుమార్‌ (25)లకు తెలిసింది. 
 
ముగ్గురు అన్నదమ్ములు మధు ఇంటికి వెళ్లి మా కుమార్తె జోలికి రావద్దని హెచ్చరించారు. మధు తమ్ముడు వారి మాట లెక్కచేయలేదు. తాము హెచ్చరించినా ఏమాత్రం మార్పు లేదని ఆగ్రహించిన ముగ్గురు సోదరులు అతడిని హత్య చేయాలని పథకం వేశారు. అర్థరాత్రి ఇంటికి వెళ్లి తలుపులు తీయమన్నారు. 
 
కొద్దిసేపటి తర్వాత తలుపులు తీయగానే ముగ్గురు అన్నదమ్ములు లోపలికి వెళ్లి కత్తి, రాడ్డుతో మధు తమ్ముడిపై దాడి చేశారు. పక్క గదిలో నిద్రపోతున్న మధు శబ్దానికి లేచి వారిని అడ్డుకున్నాడు. ముగ్గురూ మధుపై దాడి చేయడంతో అతడి తమ్ముడు ప్రాణభయంతో పారిపోయాడు. 
 
మధు తప్పించుకొని బాల్కనీ మీదుగా దూకి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా పట్టుకుని కత్తి, రాడ్డుతో దాడి చేయడంతో అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం నిందితులు ముగ్గురూ.. మధు, అతడి సోదరుడు తమపై దాడి చేశారని షాహినాయత్‌గంజ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు మధును హత్య చేసింది ప్రకాష్‌, శంకర్‌, కుమార్‌ అని తేలడంతో వారిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు