భర్త టెక్కీ... భార్య టీచర్.. వరకట్న దాహానికి వివాహిత బలి

సోమవారం, 4 మార్చి 2019 (09:21 IST)
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో వరకట్నదాహానికి మరో వివాహిత బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. వివాహ సమయంలో 45 తులాల బంగారం, 5 కేజీల వెండితో పాటు భారీగా నగదును వరకట్నం కింద ఇచ్చినా.. ఆ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు వరకట్నం దాహం తీరలేదు. ఫలితంగా భర్త పెట్టే చిత్రహింసలు, వరకట్న వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సైదాబాద్‌ ఎస్‌బీహెచ్‌ కాలనీకి చెందిన ఆడాల పృథ్విరాజ్‌ కుమార్తె నివేదిత(29) అనే యువతి పీజీ పూర్తి చేసి ఇంటిపట్టునే ఉంటూ వచ్చింది. ఈ క్రమంలో తమకు తెలిసిన వారిద్వారా వనస్థలిపురం, సుష్మాసాయినగర్‌ కాలనీ నుంచి రఘు ప్రసాద్‌ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సంబంధం వచ్చింది. 
 
ఓ కార్పొరేట్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. జీతం బాగానే ఉండడంతో పృథ్విరాజ్‌ తన కుమార్తెను ఇచ్చి వివాహం చేసేందుకు నివేదిత తల్లిదండ్రులు సమ్మతించారు. పైగా, వివాహ సమయంలో అడిగినంత కట్నం కూడా ఇచ్చారు. ఆ తర్వాత స్థానిక శుభోదయ అపార్ట్‌మెంట్‌లో రఘుప్రసాద్‌ భార్యతో కాపురం పెట్టాడు. అతడితోపాటు తల్లిదండ్రులు కూడా ఉంటున్నారు. పెళ్లైన కొత్తలో వారి కాపురం బాగానే సాగింది. కుటుంబంపై ఆర్థిక భారం పడొద్దని నివేదిత కూకట్‌పల్లిలోగల భాను ఫైర్‌ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా చేరింది.
 
అలా కొంతకాలం తర్వాత భర్త అదనపు వరకట్నం కోసం వేధించసాగాడు. అత్త, మామలతో మనస్పర్థలు వచ్చాయి. భర్త కూడా వారికే మద్దతు పలికాడు. దీంతో గత కొంతకాలంగా నివేదిత ఒంటరి జీవితాన్ని గడుపుతూ వచ్చింది. దీనికితోడు అత్తమామల సూటిపోటి మాటలు, భర్త అదనపు కట్నపు వేధింపులు ఎక్కువ కావడంతో తన బాధను తండ్రికి చెప్పుకుని వాపోయింది. దీంతో పెద్ద మనుషుల వద్ద పంచాయతీ పెట్టి నచ్చజెప్పి పంపించారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. 
 
దీంతో మనస్తాపం చెందిన ఆమె ఆదివారం ఉదయం తాము ఉంటున్న అపార్ట్‌మెంట్‌పైకి వెళ్లి అక్కడి నుంచి కిందకు దూకింది. తలకు బలమైన గాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. పైనుంచి దూకిన శబ్దం రాగానే అపార్ట్‌మెంట్‌ వాసులు బయటకు వచ్చి చూడగా నివేదిక రక్తపు మడుగులో పడి ఉంది. అత్తింటి వారు విషయాన్ని నివేదిత తల్లిదండ్రులకు చెప్పారు. భర్త, అత్తమామల వేధింపుల వల్లే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని, న్యాయం చేయాలని అపార్ట్‌మెంట్‌ వద్ద మృతురాలి కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. వనస్థలిపురం పోలీసులు వారికి సర్దిచెప్పారు. పృథ్విరాజ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు