పింఛను డబ్బుకు ఆశపడి తండ్రిని చంపిన కుమారుడు.. సహకరించిన తల్లి - చెల్లి

మంగళవారం, 20 ఆగస్టు 2019 (09:34 IST)
హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన రైల్వే మాజీ ఉద్యోగి మారుతి హత్య కేసులో కీలక విషయాలు వెలుగు చూశాయి. రైల్వే గూడ్సు డ్రైవరుగా రిటైర్డ్ అయిన మారుతి తన కుటుంబ సభ్యులతో కలిసి ఎన్ఏ కృష్ణానగర్‌లో నివశిస్తున్నాడు. ఆయనకు వచ్చే పింఛను డబ్బు కోసం కుమారుడు హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలు ముక్కులుగా చేసి ఆరు బక్కెట్లలో నింపి పారిపోయాడు. 
 
ఈ విషయం మృతుని భార్యతో పాటు.. కుమార్తెకు కూడా తెలుసని పోలీసుల విచారణలో వెల్లడైంది. వయసు మీదపడుతున్నా పెళ్లి చేయకపోవడంతో కుమార్తె, అన్ని పనులు తనతోనే చేయించుకుంటుండడంతో భార్య.. మారుతిపై కోపంగా ఉన్నారు. ఈ కారణంతో వారు కూడా హత్యకు సహకరించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దీంతో వారిద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 
 
తండ్రిని చంపి.. శవాన్ని ముక్కలు చేసి బక్కెట్లలో దాచిన తనయుడు
మద్యానికి బానిసైన తనయుడు కిరాతకుడిగా మారిపోయాడు. తొలుత కన్నతండ్రిని హత్య చేశాడు. ఆ తర్వాత శవాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు. ఆ ముక్కలను ప్లాస్టిక్ బక్కెట్లు, బిందెలలో నిల్వచేసి పారిపోయాడు. ఈ విషయం తెలిసిన మృతుని భార్య, కుమార్తె కూడా కిరాతక కొడుక్కు భయపడి బయటకు చెప్పలేదు. అయితే, ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగువారు పోలీసులకు ఇచ్చిన సమాచారంతో ఈ దారుణ హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 
 
ఈ దారుణం హైదరాబాద్ నగరంలోని డాక్టర్ ఎన్ఏ కృష్ణానగర్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, సుతార్ మారుతి అనే వ్యక్తి సౌత్‌సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్‌లో గూడ్స్‌రైల్ డ్రైవర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఈయనకు గయ, కొడుకు సూతార్ కిషన్(30), కూతురు ప్రపూల్‌లు ఉన్నారు. వీరంతా మహారాష్ట్ర నుంచి 15 యేళ్ళ క్రితం వచ్చి మౌలాలి ఆర్టీసీ కాలనీలోని డాక్టర్ ఎన్‌ఏ కృష్ణనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. 
 
ఈ నెల 16వ తేదీన రాత్రి 11 గంటల సమయంలో కొడుకు కిషన్ మద్యం తాగివచ్చి తండ్రి మారుతితో గొడవపడ్డాడు. ఈ గొడవలో తండ్రిని అతి దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి 6 నుంచి 7 ప్లాస్టిక్ బకెట్లలో నింపి దాచి ఉంచాడు. అనంతరం నిందితుడు కిషన్ పారిపోయాడు. 
 
అయితే, ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు 100కు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డ్యాగ్‌స్క్వాడ్, క్లూస్ టీంను రప్పించి ఇల్లంతా పరిశీలించగా అసలు విషయం బయటపడింది. హత్య జరిగిన సమయంలో తల్లి, కూతురు ఇంట్లోనే ఉన్నారని, కొడుకు కిషన్ భయానికే పోలీసులకు విషయాన్ని చెప్పలేదని తల్లి గయ, కూతురు ప్రపూల్ తెలిపారని ఏసీపీ సందీప్‌రావు వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు