తిరుపతిలో కఠిన ఆంక్షలు - లాక్డౌన్ మరింత పటిష్టంగా అమలు

సోమవారం, 20 జులై 2020 (18:28 IST)
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతిలో మరిన్ని కఠిన ఆంక్షలు అమలు చేయనున్నారు. ముఖ్యంగా, లాక్డౌన్‌ను మరింత పటిష్టంగా అమలు చేయనున్నారు. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఫలితంగా ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 50 వేలకు చేరింది. అలాగే, చిత్తూరు జిల్లాలో సైతం కేసులు పెరిగిపోతున్నాయి. 
 
అత్యంత ప్రధానంగా ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో సైతం కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో తిరుపతిలో కఠిన ఆంక్షలను విధించారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే షాపులు తెరిచి ఉంటాయని చిత్తూరు జిల్లా కలెక్టర్ తెలిపారు. 
 
మద్యం దుకాణాలు సైతం ఉదయం 11 గంటల వరకే తెరిచి ఉంటాయని చెప్పారు. వచ్చే నెల 5వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. తిరుపతిలోని 48 డివిజన్లు కంటైన్మెంట్ జోన్లుగా ఉన్నాయని చెప్పారు. మరోవైపు తిరుపతిలో 72 మంది పోలీసులకు కరోనా సోకగా... వారిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
 
కర్మ ఫలితాన్ని ఎదుర్కోండి!! 
దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమల తిరుపతి దేవస్థానం ఇపుడు అంతర్గత రాజకీయాలతో అట్టుడికిపోతోంది. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా తితిదే పాలకలు వ్యవహరిస్తున్నారు. దీంతో తీవ్ర విమర్శలపాలవుతున్నారు. 
 
తాజాగా తిరుమల ఓఎస్డీ డాలర్ శేషాద్రి ఆరోగ్యంపై వదంతులు వస్తున్నాయి. డాలర్ శేషాద్రికి కరోనా సోకిందని, ఆయన చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారంటూ ఎస్వీ బద్రి అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. దీనిపై తితిదే పోలీసులకు ఫిర్యాదు చేసి, బద్రిపై చర్యలు తీసుకోవాలని కోరింది. 
 
కరోనా నేపథ్యంలో డాలర్ శేషాద్రి కూడా రెండు నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇదే క్రమంలో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో తాజగా టెస్ట్ చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో బద్రి ట్విటర్ ద్వారా డాలర్ శేషాద్రి గురించి కామెంట్లు చేశారు. 
 
అంతేకాకుండా, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి, తితిదే ఛైర్మన్ ఎస్వీ సుబ్బారెడ్డిలను కూడా ఆయన ఏకిపారేశారు. వీరిద్దరిని ట్యాగ్ చేస్తూ ఎస్వీబద్రీ చేసిన ట్వీట్ ఇపుడు కలకలం రేపింది. 
 
'డాలర్ శేషాద్రికి కరోనా పాజిటివ్ అని నాకు తెలిసింది. ఇది నిజమేనా? కరోనా నేపథ్యంలో కైంకర్యాలన్నీ ఏకాంతంలోనే నిర్వహించాలనే ఒక మంచి సలహాను జగన్, వైవీ సుబ్బారెడ్డి ఎందుకు వినడం లేదు? కరోనా బరిన పడిన జీయంగార్లు ఎలా ఉన్నారు? తక్షణమే సరైన చర్యలు తీసుకోండి లేదా కర్మ ఫలితాలను ఎదుర్కోండి' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
 
దీనిపై డాలర్ శేషాద్రి తీవ్రంగా ప్రతిస్పందించారు. తనకు ఇప్పటివరకు మూడుసార్లు కరోనా టెస్టులు నిర్వహించారని... అన్ని పరీక్షల్లో నెగెటివ్ అని తేలిందని చెప్పారు. అయినప్పటికీ తనను మానసికంగా వేధించేలా బద్రి ట్వీట్లు చేస్తున్నారని అన్నారు. 
 
బద్రి ట్వీట్లతో భక్తులు భయాందోళనలకు గురవుతున్నారని చెప్పారు. మరోపైపు ఎపిడెమిక్ చట్టం కింద బద్రిపై చర్యలు తీసుకోవాలని టీటీడీకి ఫిర్యాదు చేశారు. డాలర్ శేషాద్రి ఫిర్యాదుతో పోలీసులకు బద్రిపై టీటీడీ ఫిర్యాదు చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు