ప్రియుడు క్యాబ్ డ్రైవర్.. ప్రియురాలు బి.టెక్ స్టూడెంట్.. పెళ్ళికి ఒప్పుకోలేదని..?

శనివారం, 25 జనవరి 2020 (18:29 IST)
ప్రేమ అనే మైకంతో అమాయకులైన యువత ప్రాణాలు తీస్తుంది..ప్రేమ వల్ల జీవితం సంతోషంగా ఉన్న వారి శాతాన్ని పరిశీలిస్తే.. ప్రేమించి పెళ్ళి చేసుకున్న వారిలో కేవలం 30 శాతం మంది మాత్రమే సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారని ఒక పరిశోధనలో వెల్లడైంది.

మిగిలిన వారు పెళ్లి తర్వాత సర్దుకుపోతూ లేదా చిన్న చిన్న కారణాలకే విడిపోతూ ప్రాణాలు తీసుకుంటున్నారు. మరికొందరైతే..ఆ ప్రేమ లేకుంటే..ఇక జీవితమే లేదన్నంతగా ఆ మాయలో పడి తమ బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు. అలాంటి ఘటనే ఇది.
 
అమ్మాయి బీటెక్‌, అబ్బాయి క్యాబ్‌ డ్రైవర్‌. ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెద్ద వాళ్లు పెళ్లికి ఒప్పుకోరనే భయంతో ఆత్మహత్య చేసుకున్నారు.  ఎల్‌బీనగర్‌లో మాయమైన యువతి చందానగర్‌లో ఓ హోటల్‌లో ప్రియుడితోపాటు కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఎల్‌బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మన్సూరాబాద్‌ బాలాజీనగర్‌కు చెందిన పురుషోత్తం మేనకోడలు తేలపల్లి స్వర్ణలత మేనమామ ఇంట్లో ఉంటూ బీటెక్‌ పూర్తి చేసింది. నల్గొండ జిల్లా నారాయణపురం మండలం, చిల్లాపురం కొర్రతండాకు చెందిన కొర్రా మోహన్‌నాయక్‌ నగరంలోనే ఉంటూ క్యాబ్‌డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
 
వీళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని భావించారు. స్వర్ణలత ఇంట్లో చెప్పకుండా మోహన్‌తో కలిసి బయటికి వచ్చేసింది. మేనకోడలు కనిపించకపోవడంతో పురుషోత్తం ఎల్‌బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇంట్లో నుంచి వచ్చేసిన వీళ్లిద్దరూ చందానగర్‌లోని వీవీ ప్రైడ్‌ హోటల్‌లో తమ ఐడీ కార్డులను చూపించి రూమ్‌ తీసుకున్నారు.పెద్దలు తమ పెళ్లికి అంగీకరించరని భావించిన వీరిద్దరూ కూల్‌డ్రింక్‌లో విషం కలుపుకొని తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
 
యువతి మేనమామ ఎల్‌బీనగర్‌ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభించిన పోలీసులు సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా స్వర్ణలత చందానగర్‌లోని వీవీ ప్రైడ్‌ హోటల్‌లో ఉన్నట్లు గుర్తించారు. అనంతరం చందానగర్‌ పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి రూమ్‌ తలుపు కొట్టినా తీయకపోవడంతో, అనుమానించి తలుపులు బద్దలు కొట్టి చూడగా ఇద్దరూ విగతజీవులై పడి ఉన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు