నిధుల సమీకరణే లక్ష్యంగా ఢిల్లీలో మంత్రి మేకపాటి మకాం

మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (19:40 IST)
పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు,ఐ.టీ,వాణిజ్య శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఢిల్లీకి పయనమవనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి సహకారం కోరనున్నారు.

నిధుల సమీకరణే లక్ష్యంగా  కేంద్ర మంత్రులతో  మంత్రి మేకపాటి సమావేశమవనున్నారు. అందుకోసం ఆయన సెప్టెంబర్ 9,10,11 తేదీలలో ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి బుధవారం ఉదయం 10గం.లకు ఢిల్లీకి బయలుదేరుతారు. మధ్యాహ్నం 2.25 గం.లకు ఢిల్లీ చేరిన అనంతరం మూడు రోజులపాటు ఆరుగురు కేంద్ర మంత్రులు, ఇద్దరు కార్యదర్శులతోనూ సమావేశమవుతారు.
 
మంత్రి మేకపాటి ఢిల్లీ షెడ్యూల్ : 
ముందుగా కేంద్ర రోడ్డు,రవాణా, జాతీయ రహదారులు, ఓడరేవులు, సూక్ష్మ,చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమవుతారు. అనంతరం కేంద్ర పరిశ్రమలు, వాణిజ్యం, రైల్వే శాఖ మంత్రి పీయూష్ వేద్ ప్రకాశ్ గోయల్ తో భేటీ, ఆ తర్వాత  వరుసగా కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి  మన్ సుఖ్ లక్ష్మణ్ భాయ్ మాండవీయ, కేంద్ర ఐ.టీ, కమ్యూనికేషన్స్ , ఎలక్ట్రానిక్స్, న్యాయ  శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్, కేంద్ర వ్యవస్థాపక, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి  మహేంద్రనాథ్ పాండే, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తదితర మంత్రులతో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమావేశమవుతారు.

కేంద్ర ఐ.టీ, ఎలక్ట్రానిక్స్  శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ తో పాటు, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తో కూడా మంత్రి మేకపాటి భేటీ అవుతారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెంట సంబంధిత శాఖల అధికారులు వెళుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు