తండ్రి వైఎస్ఆర్ బాటలో జగన్... నిప్పులు చెరిగిన లోకేష్

గురువారం, 4 జులై 2019 (12:24 IST)
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమావేశమయ్యారు. ఇందులో పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాలపై చర్చించి, కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని చెప్పారు.

రానున్న స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని పిలుపునిచ్చారు. త్వరలో మండలాలవారిగా సమావేశాలు నిర్వహిస్తాం కష్ట పడి పని చేసిన కార్యకర్తలు, నాయకులకి సరైన గుర్తింపు ఇస్తామన్నారు. కొత్త ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు గాలికి వదిలి కక్ష సాధింపు రాజకీయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు. ప్రజా వేదిక కూల్చివేత పై ఉన్న శ్రద్ధ రైతులకు విత్తనాలు పంపిణీ విషయంలో పెట్టలేదని మండిపడ్డారు. ఏ కార్యక్రమంపైనా సరైన స్పష్టత ఇవ్వడం లేదన్నారు. 
 
రాజధాని రైతులకు అండగా ఉంటామన్నారు. .ఏ కార్యక్రమం ఆపేసినా ప్రజా ఉద్యమం చేపడతామన్నారు. ముఖ్యమంత్రికి అవగాహన లేదు అనే విషయం బయటపడకుండా గత ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో 60కి పైగా కార్యకర్తలను హత్య చేయించారనీ, తన తండ్రి పంథాలో ప్రజలను పక్కన పెట్టి జగన్ టిడిపి కార్యకర్తలపై దాడులు చేయిస్తూ ఆరుగురు కార్యకర్తలను హత్య చేయించారని ఆరోపించారు. 
 
తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రవేశపెట్టిన ఒక్కో సంక్షేమ కార్యక్రమాన్ని అటకెక్కిస్తున్నారనీ, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఎత్తేశారని చెప్పారు. రాజధాని పనులు ఆపేశారు, కౌలు డబ్బులు వెయ్యడం లేదన్నారు. రెంట్ కోతలు ప్రారంభమయ్యాయన్నారు. రైతులకు విత్తనాలు సరఫరా చెయ్యడం లేదని లోకేశ్ మండిపడ్డారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు