ప్రశ్నిస్తే ఇంటికెళ్ళి కొడతారా?: పవన్ కళ్యాణ్ ఆగ్రహం

శుక్రవారం, 22 జనవరి 2021 (15:58 IST)
తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో చాలా కోపంతో కనిపించారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. వైసిపి నాయకులు, కార్యకర్తలు జనసైనికులపై దాడులకు నిరంతరాయంగా దిగుతున్నారంటూ మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా వైసిపి తప్పులను ప్రశ్నిస్తే ఇంటికెళ్ళి కొడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
జనసైనికులు ఇప్పటి వరకు సంయమనంతో ఉన్నారని.. సహనం కోల్పోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఒంగోలు జిల్లాలో వెంగయ్యనాయుడు ఆత్మహత్యకు కారణం వైసిపి ఎమ్మెల్యేనని... అలాగే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో జనసేన పార్టీ కార్యకర్తలపై ఇష్టానుసారం దాడులకు దిగుతున్నారంటూ మండిపడ్డారు.
 
అసలు ఎపిలో 144 సెక్షన్, 30 యాక్ట్‌ను ఎప్పుడు పడితే అప్పుడు అమలు చేసేస్తున్నారంటూ మండిపడ్డారు. శాంతిభద్రతలు పూర్తిగా ఎపిలో క్షీణించాయన్న పవన్ కళ్యాణ్.. ప్రభుత్వం చెప్పినట్లు డిజిపి వింటున్నారని.. ఎపి డిజిపి తనకున్న అధికారాన్ని పూర్తిగా సద్వినియోగం చేయడం లేదన్నారు. 
 
కరోనా బూచి చూపించి పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయడం సరైంది కాదని.. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వ ఉద్యోగులు పునరాలోచన చేయాలన్నారు. దేవదాయశాఖలో అవినీతి, అక్రమాలను వెలికితీసేందుకు జనసేన కమిటీను ఏర్పాటు చేస్తోందని.. ఆ కమిటీ అక్రమాలను బహిర్గతం చేస్తుందన్నారు.
 
మసీదులు, చర్చిలపై దాడులు జరిగితే మాకేమీ సంబంధం లేనట్లు మాట్లాడతారా అంటూ వైసిపి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. ఆలయాలపై దాడులు చేసిన నిందితులను పట్టుకోకపోగా వైసిపి మంత్రులు నోటికొచ్చినట్లు ఎవరికి వారు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు