రైలు ప్రయాణాలపై ఆంక్షలు ఎత్తివేత.. హాల్టింగ్ స్టేషన్ల కుదింపు

బుధవారం, 3 జూన్ 2020 (16:08 IST)
అంతర్రాష్ట్ర ప్రయాణికుల రాకపోకలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు ఎత్తివేసింది. కానీ, ఆంధ్రప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాల్లో ఈ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రెడ్ జోన్లకు చెందిన ప్రజల రాకపోకలపై నిషేధం కొనసాగిస్తున్నారు. అదేసమంలో అంతర్గత ప్రయాణాలపై ఉన్న ఆంక్షలను ఏపీ సర్కారు తొలగించింది. దీంతో ఇక నుంచి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడకైనా రైల్లో ప్రయాణించవచ్చు. 
 
అయితే, ప్రధాన రైళ్లకు సంబంధించి ఇప్పటివరకు ఉన్న హాల్టింగ్‌ స్టేషన్ల సంఖ్యను కుదించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారికి కొవిడ్‌-19 పరీక్షలను అన్ని స్టేషన్లలోనూ చేసేందుకు సిబ్బంది లేకపోవడంతో పలు రైళ్లకు హాల్టింగ్‌ స్టేషన్ల సంఖ్యను కుదించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రైల్వే బోర్డును కోరింది. 
 
సర్కారు వినతిపై స్పందించిన దక్షిణ మధ్య రైల్వే రాష్ట్రంలో ఇంతకు ముందు ఉన్న హాల్టింగ్‌ స్టేషన్ల సంఖ్యను కుదించింది. ఫలితంగా రద్దీ కూడా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన 22 రైళ్లకు హాల్టింగ్‌ స్టేషన్లు తగ్గనున్నాయి. 
 
ఈ నెల 4 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. రద్దు చేసిన స్టేషన్లలో రైలు ఎక్కడానికి, దిగడానికి టికెట్లను అడ్వాన్సుగా బుక్‌ చేసుకున్న వారికి చార్జీలను పూర్తిస్థాయిలో రీఫండ్‌ చేయనున్నారు. రద్దయిన స్టేషన్లు ఇవీ..
 
సికింద్రాబాద్ ‌- హౌరా (ఫలక్‌నుమా): పిడుగురాళ్ల, తాడేపల్లిగూడెం, సామర్లకోట, పలాస, ఇచ్ఛాపురం స్టేషన్లలో ఆగదు.
సికింద్రాబాద్‌ - గుంటూరు (గోల్కొండ): కొండపల్లి, రాయనపాడు, కృష్ణాకెనాల్‌, మంగళగిరి, నంబూరు, పెదకాకానిలో ఆగదు. 
గుంటూరు - సికింద్రాబాద్‌ (గోల్కొండ): కొండపల్లి, రాయనపాడు, నంబూరు, పెదకాకాని స్టేషన్లలో ఆగదు. 
తిరుపతి - నిజామాబాద్‌ (రాయలసీమ): రేణిగుంట, కోడూరు, ఓబులవారిపల్లి, పుల్లంపేట, రాజంపేట, నందలూరు, కమలాపురం, యర్రగుంట్ల, ముద్దనూరు, కొండాపురం, తాడిపత్రి, గూటి స్టేషన్లలో ఆగదు. 
హైదరాబాద్‌ - విశాఖ (గోదావరి): తాడేపల్లిగూడెం, నిడదవోలు, అనపర్తి, సామర్లకోట, పిఠాపురం, అన్నవరం, తుని, నర్సీపట్నం, ఎలమంచిలి, దువ్వాడ స్టేషన్లలో ఆగదు. 
ముంబై - భువనేశ్వర్‌ (కోణార్క్‌): తాడేపల్లిగూడెం, నిడదవోలు, సామర్లకోట, పిఠాపురం, తుని, అనకాపల్లి, పలాస, సోంపేట, ఇచ్ఛాపురంలో ఆగదు. 
ముంబై - బెంగళూరు (ఉద్యాన్‌): ఆదోని, గూటి, ధర్మవరం, ప్రశాంతి నిలయం, పెనుకొండ, హిందూపురంలో ఆగదు.
దానాపూర్ ‌- బెంగళూరు (సంఘమిత్ర): గూడూరులో ఆగదు.
బెంగళూరు - దానాపూర్ ‌(సంఘమిత్ర): రేణిగుంట, గూడూరులలో ఆగదు.
విశాఖపట్నం - న్యూఢిల్లీ (ఏపీఎక్స్‌ప్రెస్‌): రాజమండ్రి, ఏలూరు, బెజవాడలో ఆగుతుంది. 
యశ్వంత్‌పూర్ ‌- హౌరా (దురంతో): విజయవాడ, రేణిగుంటలో ఆగుతుంది. విజయనగరంలో ఆగదు. 
బెంగళూరు - నిజాముద్దీన్ ‌(రాజధాని): గుంతకల్‌, అనంతపురం స్టేషన్లలో ఆగుతుంది. 
నిజాముద్దీన్ ‌- చెన్నై(బై వీక్లీ): విజయవాడలో ఆగుతుంది.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు