పశువులకు కూడా తాగునీటిని అందించేందుకు ప్రత్యేక చర్యలు: మంత్రి పెద్దిరెడ్డి

శుక్రవారం, 5 జూన్ 2020 (21:04 IST)
రాష్ట్రంలో తాగునీటి అవసరాల కోసం ఈ వేసవిలో ప్రభుత్వం రూ.277.68 కోట్లు కేటాయించినట్లు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామంచద్రారెడ్డి తెలిపారు.

ఈ వేసవిలో స్టేట్ డ్రాట్ రిలీఫ్ ఫండ్ (ఎస్డిఆర్ఎఫ్) కింద 77.68 కోట్లు, స్టేట్ డెవలప్ మెంట్ స్కీం (ఎస్డీఎస్) కింద రూ. వంద కోట్లు, సిపిడబ్ల్యుఎస్ఎస్ కింద రూ.6.80 కోట్లు, సత్యసాయి మంచినీటి పథకం కింద రూ. 33.73 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

రాష్ట్రప్రభుత్వం ముందుచూపుతో వేసవి ప్రారంభంలోనే తీసుకున్న చర్యల కారణంగా గత ఏడాదితో పోలిస్తే మంచినీటి సమస్యను తక్కువ ఆవాసాలకే పరిమితం చేయగలిగామని అన్నారు. గత ఏడాది 5175 ఆవాసాలకు మంచినీటిని ట్యాంకర్ల ద్వారా అందించగా, ఈ ఏడాది 3314 ఆవాసాలకే దానిని పరిమితం చేయగలిగామని తెలిపారు.

గ్రామాల్లో ముందుగానే వేసవి మంచినీటి ప్రణాళికను రూపొందించి, గ్రామీణ నీటి సరఫరా (ఆర్ డబ్ల్యుఎస్) ద్వారా అవసరమైన చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.

బోర్లకు ఫ్లషింగ్ చేయించడం, గ్రామాలకు పైప్ లైన్ల ద్వారా నీటిని అందించడం, మంచినీటి వనరులు పూర్తిగా అడుగంటిన ఆవాసాలను గుర్తించి, ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయడం వంటి చర్యలతో ప్రజల దాహార్తిని తీర్చామని తెలిపారు.

అలాగే రాష్ట్రంలో పశువులకు కూడా గుర్తించిన ఆవాసాల్లో మంచినీటిని అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు