దుష్ట చతుష్టయం రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తున్నారు : దేవినేని ఉమ

సోమవారం, 10 ఫిబ్రవరి 2020 (16:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుష్ట చతుష్టయం కొత్తగా ఏర్పడిందనీ, ఈ దుష్టచతుష్టయం రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తోందని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు ఆరోపించారు. ఆ దుష్ట చతుష్టయం ఎవరో కాదనీ, ముఖ్యమంత్రి వైఎస్. జగన్, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అని దేవినేని ఉమ ఆరోపించారు. 
 
అంతేకాకుండా, నిజాయితీగా పనిచేసే అధికారులను సస్పెండ్ చేస్తూ అధికారులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేశారంటే వైసీపీ నేతల పిచ్చి పరాకాష్టకు వెళ్లిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చన్నారు. 
 
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో నిజాయితీగా పని చేసిన అధికారులపై పథకం ప్రకారం వైసీపీ దాడులు చేస్తోందని ఆయన ఆరోపించారు. ఎంపీ విజయసాయిరెడ్డి ఢిల్లీలో ఉండి చక్రం తిప్పి ఇదంతా చేస్తున్నారని మాజీ మంత్రి సంచలన ఆరోపణలు చేశారు. 
 
ముఖ్యంగా, సజ్జల రామకృష్ణ రెడ్డి కనుసన్నల్లోనే రాష్ట్ర హోంశాఖ పని చేస్తోందన్నారు. జగన్, విజయసారెడ్డి వ్యవస్థలను కుప్పకులుస్తున్నారు. 8 నెలలుగా పోలీస్ అధికారులకు పోస్టింగ్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. మూడు నెలలు వీఆర్‌లో ఉంటే జీతాలు ఇవ్వమని జీవో ఇవ్వడం దారుణం. జగన్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిందన్నారు. 
 
అమరావతి కోసం దీక్ష చేస్తున్న రైతులను అర్థరాత్రి వారిని అరెస్టు చేయడం సరికాదు. మూడు రాజధానులకు అనుకూలంగా నాగార్జున యూనివర్సిటీ వీసీ సెమినార్ ఎలా పెట్టించారు?. అమరావతి కోసం శాంతియుతంగా విద్యార్థులు ఆందోళన చేస్తుంటే వారిని బలవంతంగా అరెస్ట్ చేశారు. జగన్ మాట వింటున్న అధికారులు ఒక్కసారి ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మిని గుర్తుకు తెచ్చుకోవాలని హెచ్చరించారు. 
 
హైకోర్టు వద్దు అంటున్న వినకుండా అమరావతి నుంచి కార్యాలయాలు తరలిస్తున్నారు. జగన్, విజయసారెడ్డి, సజ్జల, వై వి సుబ్బారెడ్డి దుష్ట చతుష్టయంగా ఏర్పడి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. అమరావతి రాజధాని పోరాటంలో ఎలా చీలిక తీసుకురావాలని ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది అని మాజీ మంత్రి దేవినేను ఉమామహేశ్వర రావు ఆరోపించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు