పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదు: హోంమంత్రి

సోమవారం, 3 ఆగస్టు 2020 (21:11 IST)
కర్నూలు జిల్లా వెలుగోడు మండలంలో గిరిజన మహిళపై జరిగిన దాడిని హోంమంత్రి మేకతోటి సుచరిత తీవ్రంగా ఖండించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి దాడికి సంబందించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

నాలుగురోజుల క్రితం కర్నూలుజిల్లా వెలుగోడు మండలం జమ్మి నగర్ తండాకు చెందిన 46 సంవత్సరాల వయస్సు కలిగిన దంపతులపై ముగ్గురు యువకులు దాడి చేసి గాయపరిచారు. బండి ఆత్మకూరు మండలం నారపరెడ్డి కుంట గూడానికి చెందిన ముగ్గురు చెంచు యువకులు వచ్చి తీవ్రంగా గాయపరిచారని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెలుగోడు ఎస్సై ముగ్గురు నిందితులపై 324, 354ఎ సెక్షన్ ల కింద కేస్ నమోదు చేశారు. నిందితులను అరెస్ట్ చేయడంలో ఎస్సై అలసత్వం వహిస్తున్నాడని బాధితులు నేడు మరోసారి పోలీస్ ఉన్నతాధికారులను ఆశ్రయించడం జరిగింది. ఘటనపై జిల్లా ఎస్పీ పకీరప్ప ప్రత్యేక చొరవ తీసుకోవడం జరిగింది. ఆత్మకూరు డీఎస్పీ వెంకట్రావు మహిళా పోలీసుల సహకారంతో బాధితురాలితో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించారు.

తనపై దాడి చేయడంతో పాటు ముగ్గురు యువకులు అత్యాచారం చేసారని బాధితురాలు తెలిపింది. ఈ నేపథ్యంలో ముగ్గురు చెంచు యువకులపై 376డీ, 506 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు ఒకరిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మిగిలిన ఇద్దరు నిందితుల కోసం పోలీసులు ప్రత్యేకంగా గాలిస్తున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి కూడా తరలించామని డీఎస్పీ తెలిపారు.

రాష్ట్రంలో ఎక్కడైనా సరే మహిళలపై అత్యాచార సంఘటలు జరిగితే ఉపేక్షించేది లేదని హోంమంత్రి మేకతోటి సుచరిత హెచ్చరించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి అని, మహిళల రక్షణ కోసం అనేక కార్యక్రమాలను చేపడుతున్నారని గుర్తు చేశారు. మహిళలపై జరిగే దాడుల విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని, తప్పక చర్యలు తీసుకుంటామని హోంమంత్రి సుచరిత హెచ్చరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు