నీట మునిగిన తిరుచానూరు నక్కల కాలనీ.. నిరాశ్రయులైన వందల కుటుంబాలు

గురువారం, 26 నవంబరు 2020 (17:13 IST)
తిరుపతి తిరుచానూరు పంచాయతీ పరిధిలోని నక్కల కాలనీ వర్షపు నీటితో మునిగిపోయింది. ఇక్కడ నివసించే వందల మంది నిరాశ్రయులయ్యారు. గురువారం ఉదయం నిరాశ్రయులైన కుటుంబాలకు  ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆదేశాల మేరకు తిరుచానూరు జడ్పీ హైస్కూల్ లో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 

బాధితులకు సౌకర్యాల కల్పనపై ఎమ్మెల్యే చెవిరెడ్డి తిరుపతి రూరల్ ఎంపీడీవో సుశీలాదేవి, తిరుపతి రూరల్ తహసిల్దార్ భాగ్యలక్ష్మి తో కలిసి వచ్చి పరిశీలించారు. మీకు ఇబ్బంది లేకుండా చూసుకుంటామని, మీకు నేను అండగా ఉంటానని బాధితులకు ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.

బాధితులకు భోజన సదుపాయాలు, తాగునీరు, విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా చూడాలని పంచాయతీ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి కి సూచించారు. వర్షపు నీటిని తొలగించేందుకు యుద్ద ప్రాతపదికన చర్యలు చేపట్టాలన్నారు. 
కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించాలని బాధితులకు తెలియజేశారు.

అనంతరం వర్షపు నీటితో నిండిన నక్కల కాలనీని పరిశీలించారు. అక్కడ బాధితులు తమకు శాశ్వత ప్రాతిపదికన సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. పక్కా ఇళ్లు కట్టించాలని విన్నవించారు.

తాగునీరు కలుషితమయ్యాయని వివరించారు. అత్యవసర సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట తిరుచానూరు మాజీ సర్పంచ్ రామచంద్రారెడ్డి, వైయస్సార్ పార్టీ నాయకుడు శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 
లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తం..
చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోరారు. అధికారులు కూడా పర్యవేక్షిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ఎక్కడ ఎటువంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఈ మేరకు చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ యంత్రాంగానికి ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు