హుండీ ఆదాయానికి గండికొట్టిన కరోనా.. శ్రీవారి సిబ్బందికి వేతన కష్టాలు

సోమవారం, 11 మే 2020 (14:15 IST)
తిరుమల శ్రీవారి సిబ్బందికి వేతన కష్టాలు తప్పలేదు. శ్రీవారి హుండీ ఆదాయానికి కరోనా వైరస్ గండి కొట్టింది. దీంతో ఈ లాక్‌డౌన్ సమయంలో ఉద్యోగులకు వేతనాలు చెల్లించ విషయంపై తితిదే ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటోంది. 
 
ప్రపంచంలోన అత్యంత సంపన్న ఆలయం ఏది అంటే ఠక్కున చెప్పే పేరు శ్రీవారి పుణ్యక్షేత్రం. ఈ ఆలయానికి భక్తుల కానుకల ద్వారానే నెలకు రూ.200 నుంచి రూ.250 కోట్ల మేరకు వసూలవుతుంటాయి. అయితే, కరోనా వైరస్ కారణంగా గత 50 రోజులుగా శ్రీవారి దర్శనాన్ని నిలిపివేశారు. దీంతో కొండపైకి ఒక్క భక్తుడు కూడా వెళ్లడంలేదు. 
 
దీంతో శ్రీవారి ఆదాయం పూర్తిగా ఆగిపోయింది. ఫలితంగా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ కరోనా లాక్డౌన్ కారణంగా సుమారుగా రూ.400 కోట్ల మేరకు ఆదాయాన్ని కోల్పోయినట్టు సమాచారం. 
 
దీనిపై తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితులు ఎలాగున్నా జీతాలు, పెన్షన్లు, ఇతర తప్పనిసరి ఖర్చులు చెల్లించడం తమ విధి అని అన్నారు. ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు, ఇతర ఖర్చుల నిమిత్తం ఇప్పటికే రూ.300 కోట్లు ఖర్చు చేశామన్నారు. 
 
అయితే, బ్యాంకుల్లో శ్రీవారి పేరిట ఉన్న 8 టన్నుల బంగారం, రూ.14 వేల కోట్ల ఫిక్స్ డ్ డిపాజిట్ల జోలికి వెళ్లకుండా ప్రస్తుత సమస్య నుంచి గట్టెక్కడం ఎలాగన్నదాని గురించి ఆలోచిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు