ఒత్తిడిగా తీసుకోవద్దు.. బాధ్యతనుకోండి.. పాఠ్యాంశాల్లో సందేహాలు నివృత్తి కోసం టోల్ ఫ్రీ నంబరు: విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్

ఆదివారం, 28 జూన్ 2020 (10:56 IST)
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ‘మన బడి: నాడు- నేడు’ కార్యక్రమాన్ని  విజయవంతం చేయడానికి విద్యాశాఖా ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు, ఉపాధ్యాయులు, పాఠశాల తల్లిదండ్రుల కమిటీలు ఒత్తిడిగా భావించకుండా అందరూ భాగస్వాములై మనందరి బాధ్యతగా స్వీకరించాలని రాష్ట్ర విద్యాశాఖామాత్యులు  డా. ఆదిమూలపు సురేష్ అన్నారు.

సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ‘మన బడి: నాడు  - నేడు కార్యక్రమం లో భాగంగా రాష్ట్ర స్థాయిలో కొనుగోలు చేస్తున్న సామగ్రి ప్రదర్శన’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో  పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి  బుడితి రాజశేఖర్, పాఠశాల విద్య కమిషనర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు, పాఠశాల విద్య సలహాదారు ఎ.మురళి, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఎండి బాలకృష్ణ, ఆంగ్ల మాధ్యమ ప్రత్యేక అధికారిణి  కె.వెట్రిసెల్వి, సమగ్ర శిక్షా రాష్ట్ర అదనపు పథక సంచాలకులు ఆర్.మధుసూదనరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో విద్యాశాఖామాత్యలు డాక్టర్ ఆదిమూలపు సురేష్మాట్లాడుతూ...
ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో విద్య వ్యవస్థను బలోపేతం చేయడానికి ‘జగనన్న అమ్మఒడి, జగనన్న గోరుముద్ద, ‘మన బడి: నాడు-నేడు’ వంటి పథకాలతో విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు.

వైద్య, వ్యవసాయ రంగాలతో పాటు విద్యారంగంపై ప్రధాన దృష్టిసారించారని, ఇందులోభాగంగా పాఠశాలల మౌలిక సదుపాయాల పూర్తిగా మార్చివేయాలని దృఢసంకల్పంతో మనబడి నాడు నేడు కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అతి దారుణంగా ఉంది.

‘మన బడి: నాడు-నేడు’లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 44,512 పాఠశాలలకు ఎంపిక కాగా మొదటి దశలో భాగంగా 15,715 పాఠశాలలను తొమ్మిది అంశాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ వాటి స్థితిగతులు మార్చనున్నామని తెలిపారు.

ఇందుకోసం ఇప్పటిదాకా రూ. 504 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసే వాటిలో ఎక్కడ నాణ్యత విషయంలో రాజీ పడకుండా ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. 
 
నాణ్యతలో లోపం లేకుండా చర్యలు:
ఈ సందర్బంగా రాష్ట్ర స్థాయిలో కొనుగోలు చేస్తున్న పరికరాల ప్రదర్శనను మంత్రి పరిశీలించారు. ప్రదర్శనలో భాగంగా ఏర్పాటు చేసిన ‘మన బడి:నాడు-నేడు’కు సంబంధించిన సామగ్రిని పరిశీలించి ధర తక్కువగా ఉండి, నాణ్యతలోపం లేకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. ‘మన బడి: నాడు- నేడు’ కార్యక్రమానికి సంబంధించి ఎక్కడా నిధులకు ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి చర్యలు తీసుకున్నారని తెలిపారు. 

దీనికోసం ఖర్చుపెట్టే ప్రతి రూపాయి అందరికీ తెలిసేలా ఆన్ లైన్లో పొందుపరిచామని తెలిపారు.  జూలై నెలాఖరికి మేము చేపట్టిన ‘మన బడి:నాడు- నేడు’ పనులు స్పష్టంగా కనిపిస్తాయని అన్నారు.  రివాల్వింగ్ ఫండ్ కింద 710 కోట్ల రూపాయలను ఏర్పాటు చేశామని తెలిపారు.

విద్యాశాఖలోని రివర్స్ టెండరింగ్ వల్ల 143 కోట్ల రూపాయాలను ఆదా చేశామని తెలిపారు.  అనంతరం ఈ విద్యా సంవత్సరంలోని పాఠశాల ప్రారంభంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థికి అందించబోయే ‘జగనన్న విద్యాకానుక’ కిట్లను పరిశీలించారు. 
 
టోల్ ఫ్రీ నంబరు ప్రారంభం 
విద్యార్థులకు పాఠ్యాంశాలలోని సందేహాలు నివృత్తి చేసుకోవడానికి 1800 123 123 124 టోల్ ఫ్రీ నంబరును ప్రారంభించారు. సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 10 నుండి 12.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4వరకు పని చేస్తుందని తెలిపారు.
 
ఈ సందర్భంగా ‘విద్య మీద ఖర్చు చేస్తున్నది నేను ఖర్చు అనుకోవట్లేదు. అది భావితరాల మీద పెట్టుబడిగా భావిస్తాను’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేసిన మాటలు గుర్తు చేశారు. మా ప్రభుత్వం బడ్జెట్లో 16శాతం (దాదాపు 31,000 కోట్ల రూపాయలు) విద్యకు ఖర్చు చేస్తోందని తెలిపారు. ఇది విద్యాభివృద్ధి కోసం సమాజం మీద పెట్టుబడి అని మంత్రి  అన్నారు.
 
మార్గదర్శకాల ప్రకారం నిర్ణయం తీసుకుంటాం 
డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణ పై పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు ‘డిగ్రీ, పీజీ పరీక్షలపై కేంద్రం నుంచి వచ్చిన గైడ్ లైన్ ప్రకారం నిర్ణయం తీసుకుంటామని సమాధానమిచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు