టిటిడి ఛైర్మన్‌‌కు కోపమొచ్చింది, ప్రతిదీ రాజకీయమేనా అంటూ..?

శనివారం, 19 సెప్టెంబరు 2020 (15:23 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డికి కోపమొచ్చింది. ప్రతిపక్షనేత, తెలుగుదేశం పార్టీ అధినేత నారాచంద్రబాబునాయుడు ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు టిటిడి ఛైర్మన్.
 
తిరుమల వ్యవహారాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటూ టిటిడి ప్రతిష్టకు భంగం కలిగించేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో తిరమలలో దళారీ వ్యవస్ధ, అవినీతి ఉండేది. మేము వచ్చిన తరువాత పూర్తిగా నిర్మూలించాం.
 
తిరుమలలో ఎలాంటి అన్యమత ప్రచారం జరుగలేదు. గత ప్రభుత్వ హయాంలో నెల్లూరు ఆర్టీసీ డిపోలో ముద్రించిన అన్యమత ప్రచార టిక్కెట్లను కుట్రపూరితంగా తిరుమలకు పంపిన విషయం విచారణలో తేలింది. దీనిపైన కేసులు కూడా పెట్టాం.
 
తిరుమలకు వచ్చే అన్యమతస్తులకు డిక్లరేషన్ అవసరం లేదు. స్వామివారి మీద నమ్మకం ఉంటే చాలు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డిక్లేరేషన్ పెట్టకుండానే స్వామివారిని దర్సించుకున్నారని, అసలు ఆయన అలా చేయడం తప్పని, ఇలా ఏవేవో మాట్లాడుతున్నారు చంద్రబాబు.
 
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి కోట్లాది మంది హిందువులు ఎంతో భక్తిభావంతో ఎదురుచూస్తున్నారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో ఆద్యాత్మిక వాతావరణాన్ని కలుషితం చేసే విధంగా చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయని, అలాంటి వ్యాఖ్యలు మానుకోవాలంటూ హితవు పలికారు టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు