వైసీపీ గూండాలు అడ్డుకుంటారు...నామినేషన్లు ఆన్లైన్ లో దాఖలు చేసేందుకు అనుమతించండి: వర్ల రామయ్య లేఖ

శనివారం, 23 జనవరి 2021 (10:46 IST)
గత ఎన్నికల్లో అధికార వైసీపీ గూండాలు ఎన్నికల్లో పాల్గొనాలనే ఆసక్తిగల అభ్యర్థుల నామినేషన్లు అడ్డగించిన నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో నామినేషన్లను ఆన్‌లైన్‌లో సమర్పించేలా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ రాశారు.
 
పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో నిష్పక్షపాత ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు అభ్యర్థించారు. మార్చి 2020లో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అప్రజాస్వామిక, హింసాత్మక విధానాలను దృష్టిలో ఉంచుకొని ఈ విషయాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకు వస్తున్నానని లేఖలో పేర్కొన్నారు.

రాష్ట్రంలోని ఒక వర్గం పోలీసులు అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కై టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించారన్నారు. మార్చిలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఎన్నికల అధికారులు సహకరించలేదని తెలిపారు.

ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులపై అధికార వైసీపీ పార్టీ గూండాలు హింసాత్మక దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. సాధారణ ప్రజలను కూడా భయాందోళనలకు గురిచేశారని మండిపడ్డారు.
 
ఎన్నికల అధికారులు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులకు ఒక ఓటర్ లిస్టు, అధికార పార్టీ ‌అభ్యర్థులకు మరో ఓటర్ లిస్టులు ఇచ్చి అనేక అవకతవకలకు పాల్పడ్డారని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు