ఏపీలో మాకు ప్రాణరక్షణ లేదు... హైకోర్టులో వైఎస్ వివేకా కుమార్తె (video)

గురువారం, 30 జనవరి 2020 (12:57 IST)
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుటుంబానికి ఇపుడు ప్రాణభయంపట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాక్షాత్ వైఎస్ తనయుడు వైఎస్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ.. వైఎస్ వివేకా కుమార్తె సునీత మాత్రం తమకు ప్రాణభయం ఉందని హైకోర్టుకు తెలిపింది. పైగా, తన తండ్రి హత్య కేసును సీబీఐకు అప్పగించాలని కోరుతూ ఓ పిటిషన్ కూడా దాఖలు చేసింది. 
 
తన తండ్రిని హత్య చేసిన వారు తనను, తన భర్తను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందనే భయాందోళనలను ఆమె వ్యక్తపరిచారు. తమకు సాయుధ రక్షణ కల్పించాలని కోరుతూ ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు రాసిన లేఖను కూడా హైకోర్టుకు అందజేశారు. ఈ లేఖను గత ఏడాది నవంబర్ 21వ తేదీన డీజీపీకి ఆమె రాశారు.
 
ఈ కేసులో కీలకమైన శ్రీనివాస రెడ్డి ఇప్పటికే హత్యకు గురయ్యారని... ఈ నేపథ్యంలో పరమేశ్వర రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, వాచ్ మెన్ రంగయ్య ప్రాణాలకు కూడా ముప్పు ఉందనే ఆందోళన తనకు ఉందని సునీత పేర్కొన్నారు. దర్యాప్తు వేగవంతంగా కొనసాగేందుకు తాను, తన భర్త పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నామని... అయినా హంతకుడెవరో ఇంతవరకు గుర్తించలేకపోయారని ఆమె వాపోయారు. ఈ పరిస్థితుల్లో తన కుటుంబ భద్రత పట్ల ఆందోళన కలుగుతోందని కోర్టుకు తెలిపారు.
 
నిజానికి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగింది. ఈ హత్యను తెదేపా నేతలు చేయించారని వైకాపా నేతలు ఆరోపిస్తూ వచ్చారు. కానీ, గత ఎన్నికల్లో తెదేపా అధికారం కోల్పోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత వైఎస్ వివేకా హత్య కేసులో ఎలాంటి పురోగతి అనేది లేకుండా పోయింది. దీనిపై విమర్శలు చెలరేగుతున్నా సీఎం జగన్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు