తులసి ఆకుల్ని నీళ్ళలో వేసి మరిగించి...?

శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (09:46 IST)
కొన్ని తులసి ఆకులను రాత్రి నీటిలో నానబెట్టి ఆ నీటితో ఉదయం పళ్ళు తోముకుంటే నోటి దుర్వాసన, నోటిపొక్కులు తగ్గుతాయి. ఉదయాన్నే తులసి ఆకులను పిడికెడు దంచి కషాయంగా కాచి లేదా ఆ రసంలో ఒక స్పూన్ తేనె చేర్చి తాగితే కఫం తగ్గుతుంది. తులసి ఆకుల రసంలో తేనెను కలిపి రోజుకు రెండుసార్లు చొప్పున తీసుకుంటే దగ్గు, జలుబు తగ్గుతాయి.
 
జలుబు, దగ్గుతో భాదపడే వారు ఒక స్పూన్ శొంఠి, ఒక స్పూన్ మిరియాల పొడి, అయిదు నుండి పది తులసి ఆకులు వేసి మరిగించిన నీటిని(కషాయం) తాగితే ఫలితం ఉంటుంది. కళ్ళు మంటలు, కళ్ళవెంట నీరు కారడం వంటి సమస్యలతో బాధపడేవారు తులసి ఆకుల రసాన్ని దూదితో ముంచి కనురెప్పల మీద రాసి చూడండి. (కంట్లో పడకుండా జాగ్రత్త వహించండి).
 
తులసి ఆకుల రసానికి శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచే గుణం ఉంది. తులసి ఆకులు, పుదీనా ఆకులు కలిపి కషాయంగా కాచి తాగితే రోజు వారీ వచ్చే జ్వరం తగ్గుతుంది. తులసి ఆకుల్ని నీళ్ళలో వేసి మరిగించి ఆ నీటితో పుక్కిలిస్తే గొంతు నొప్పులు తగ్గుతాయి. తులసి రసాన్ని తేనెతో కలిపి ఒక స్పూను ప్రతిరోజూ తాగితే నోటి పూత, గొంతునొప్పి, బొంగురుపోయిన గొంతు సాఫీగా ఉంటుంది.
 
తులసి శరీరంలో ఉండే అధిక కొవ్వును నివారిస్తుంది. తులసి ఆకులను మజ్జిగతో కలిపి సేవిస్తే బరువు తగ్గుతారు. నిద్రలేమితో బాధపడేవారికి తులసి గొప్ప ఔషధం. అడవి తులసి రసాన్ని పంచదారతో కలిపి ప్రతిరోజూ రాత్రి పడుకోబోయే ముందు రెండు చెంచాలు తాగితే చక్కగా నిద్రపడుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు