కార్గిల్ యుద్ధానికి 20 ఏళ్ళు... కానీ, ఏం ఒరిగింది?' - తండ్రిని కోల్పోయిన గుర్‌మెహర్ కౌర్

సోమవారం, 29 జులై 2019 (21:09 IST)
గుర్‌మెహర్ కౌర్ తండ్రి కెప్టెన్ మందీప్ సింగ్ భారత సైన్యంలో ఉండేవారు. ఆయన కార్గిల్ యుద్ధ సమయంలో వీరమరణం పొందారు. 2017లో గుర్‌మెహర్ సోషల్ మీడియాలో ఒక ఫొటో షేర్ చేశారు. "పాకిస్తాన్ నా తండ్రిని చంపలేదు. యుద్ధమే చంపింది" అని కామెంట్ పెట్టారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆమెపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. కార్గిల్ యుద్ధానికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీబీసీ కోసం రాసిన ఒక బ్లాగ్‌లో గుర్‌మెహర్ తన అభిప్రాయాలు పంచుకున్నారు.

 
గుర్‌మెహర్ ఏమన్నారో ఆమె మాటల్లోనే...
కార్గిల్ యుద్ధం జరిగి ఎన్నేళ్లు గడిచాయా, అని మా ఇంట్లో ఎవరూ దాని గురించి లెక్కించరు. అది ఎప్పుడు జరిగిందో ఎవరికైనా చెప్పాల్సివస్తే, మేం మా చెల్లిని 'నీ వయసెంత' అని అడుగుతాం. ఎందుకంటే ఆపరేషన్ విజయ్ సఫలం అయిన కొన్ని రోజులకే మా నాన్న చనిపోయారు. అప్పుడు మా చెల్లెలు వయసు మూడు నెలలు. ఆ గతించిన కాలమంతా మా చెల్లిలా మా కళ్ల ముందే కనిపిస్తూ వచ్చింది. ఎందుకంటే అప్పుడు ఆ చిన్ని చిన్ని చేతులే ఇప్పుడు పెద్దవిగా, బలంగా మారాయి. ఆ మూడు నెలల పాప ఇప్పుడు 20 ఏళ్ల యువతి.

 
ఈ 20 ఏళ్లలో మేం ఆమె నోటి నుంచి నాటి ఘటన గురించి ఎప్పుడూ ఒక్క మాట కూడా వినలేదు. మేం దాని గురించి ఎప్పుడు ఏం మాట్లాడినా, ఏం అడిగినా, మా చెల్లెలు కష్టంగా కొన్ని మాటలు మాత్రమే మాట్లాడుతుంది. అవునా అంటే, చిన్నగా తలవూపి అవుననే సైగ చేస్తుంది. నేను, మా అమ్మ మాత్రం మాకు మిగిలిన ఆ గుప్పెడు జ్ఞాపకాలను గుర్తు చేసుకుని సంతోషపడిపోతుంటాం.

 
మేమిద్దరం అప్పటి మసకబారిన ఫొటోల్లో మా నాన్న ముఖాన్ని చూసి ఆయన్ను గుర్తుచేసుకుంటాం. కానీ, ఆ ఫొటోలు చూస్తే మా చెల్లి ముఖంలో ఎలాంటి భావాలూ కనిపించవు. ఎప్పుడూ ఏం మాట్లాడదు. మాట్లాడమని మేం కూడా తనను బలవంతం చేయం.

 
మా అమ్మ బాధపడతారు
భారత్‌లో ప్రతి ఏటా జులై 26న కార్గిల్ విజయ్ దివస్ సంబరాలు జరుపుకున్నప్పుడు మేం కూడా వాటిలో పాల్గొంటుంటాం. 1999లో పాకిస్తాన్ చొరబాటుదారులకు వ్యతిరేకంగా సాధించిన విజయానికి అది మనకు పెద్ద సంబరం. గత కొన్నేళ్లుగా జులై నెల వస్తే చాలు, ప్రభుత్వేతర సంస్థలు, రాజకీయ నాయకులు, లేడీస్ క్లబ్‌లు, ఇంకా చాలామంది నుంచి మాకు ఆహ్వానాలు అందడం మొదలవుతుంది.

 
మా అమ్మ వారి కార్యక్రమంలో పాల్గొనాలని, భారత సైనికుల సాహసాలను కీర్తించాలని, తను ఇప్పటివరకు ఎంత ధైర్యంగా జీవితంతో పోరాడుతోందో చెప్పాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మా అమ్మ తరచూ అలాంటి కార్యక్రమాలకు వెళ్లడానికి సందేహిస్తుంటారు. అక్కడ వారంతా ఆమె తన మనసు విప్పి గుండెలోని బాధంతా చెప్పుకుంటారని, కార్యక్రమానికి వచ్చినవారు శ్రద్ధగా వినేలా తన బాధను పంచుకోవాలని కోరుకుంటారు.

 
జనం ఆశల వల్ల ఆమె రెండు భాగాలుగా విడిపోతారు. ఆమెలో ఒకరు భర్త జ్ఞాపకాలతో ఆయన గురించి జరిగే చర్చల్లో పాల్గొంటారు. ఇంకొకరు మా నాన్న గురించి ఎంత ఎక్కువగా మాట్లాడితే, అంత ఎక్కువగా మాకు గుర్తొస్తారని, మా జీవితంలో ఆయన లోటు బాగా తెలిసొస్తుందని అనుకుంటారు.

 
నా ఆలోచనలు వేరే
నా ఆలోచనలు ఎప్పుడూ మా అమ్మకు భిన్నంగా ఉంటూ వచ్చాయి.. అలాంటి కార్యక్రమాలకు వెళ్లి నా మనసులోని బాధను వారికి చెప్పుకోవాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. మా కథలను అక్కడికొచ్చిన ఆంటీలకు వినిపించాలని, వాళ్లు ప్రేమగా నా చెంపలు నిమిరి నేనెంత దురదృష్టవంతురాలినో నాకు గుర్తుచేయాలని, తండ్రి లేని బిడ్డ అని సానుభూతి చూపించాలని నేను కోరుకోను.

 
తర్వాత ఆంటీలు నన్ను తమ ఒడిలోకి తీసుకోవడం, నాకు బాగా అనిపించడానికి, నన్ను ఓదార్చడం... ఇలాంటి సానుభూతి నాకు నచ్చదు. పాకిస్తాన్ సైనికుల నుంచి మన పోస్టులు స్వాధీనం చేసుకుని రెండు దశాబ్దాలు గడిచిపోయాయి. లోయలో ఇబ్బందులు ఎప్పుడూ ఉన్నట్టే ఉన్నాయి. యుద్ధ విరమణ ప్రకటించారు.


కానీ హింసాత్మక కార్యకలాపాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అప్పటి నుంచి ఇప్పటివరకూ కశ్మీర్లో సైన్యం మోహరింపు ఏమాత్రం తగ్గలేదు. జవాన్లు, సాధారణ పౌరుల మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన ఈ ఆఖరి యుద్ధం జరిగి 20 ఏళ్లే అయ్యింది. కానీ ఈ వివాదం మాత్రం దేశ విభజన సమయం నుంచీ అలాగే కొనసాగుతోంది.

 
నేతలు ఫొటోలకే పరిమితం
కశ్మీర్ మన నుంచి విడదీయలేని భాగం అనే విషయం భారతీయుల మనసుల్లో నాటుకుపోయింది. పాకిస్తాన్‌ మనసులో కూడా కశ్మీర్ దేశవిభజన సమయం నుంచీ ఇప్పటివరకూ ఒక అపరిష్కృత అజెండాగా నిలిచిపోయింది. ఫలితంగా ఈ రెండు దేశాల మధ్య పోటాపోటీ కొనసాగుతూనే ఉంది. దీనికి పరిష్కారం వెతకాలని వీరిలో ఎవరూ కోరుకోవడం లేదు.

 
గత పదేళ్లలో రెండు దేశాల ప్రధానమంత్రులు ఎన్నోసార్లు సమావేశం అయ్యారు. కానీ, వారి వైపు నుంచి ఫొటోలకు ఫోజులివ్వడం తప్ప మరేమీ రాలేదు. చిరునవ్వులు చిందిస్తూనో, హత్తుకుంటూనో కనిపించే ఆ ఫొటోల వల్ల ఒరిగేదేమీ ఉండదని ఆ రాజకీయ నేతలకు చెప్పాల్సిన సమయం వచ్చినట్టు నాకు అనిపిస్తోంది. అయితే, ఆ ఆటలు సాగని సమయంలో ఇదే అగ్ర నేతలు పరస్పరం విద్వేషాగ్నితో రగిలిపోతుంటారు.

 
దానివల్ల ఏ లక్ష్యమూ పూర్తికాదు, మా గాయాలు కూడా మానవు. ఏళ్లు గడుస్తున్నకొద్దీ సరిహద్దులకు అటూ-ఇటూ కాల్పులు కూడా కొనసాగుతూనే ఉంటాయి. ఈ వివాదాన్ని సజీవంగా ఉంచేందుకు వీలైనంత ఎక్కువ డబ్బు ఖర్చుచేస్తుంటారు. ఈ హింస పెరిగేకొద్దీ ప్రజల్లో భయాందోళనలు కూడా విస్తరిస్తున్నాయి. ఇది చివరికి ఎక్కడివరకూ వెళ్తుంది అనే ప్రశ్నకు సమాధానం వెతకడం ఇప్పుడు చాలా అవసరం అనిపిస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు