అమరావతిలోనే రాజధాని ఉండాలి,... వైకాపాకు ప్రజలే బుద్ధి చెబుతారు: పురందేశ్వరి - ప్రెస్ రివ్యూ

సోమవారం, 28 సెప్టెంబరు 2020 (13:42 IST)
''ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో భాజపా రెండు నాల్కల ధోరణితో వ్యవహరించడం లేదు. ద్వంద్వ వైఖరి ప్రసక్తే లేదు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. అమరావతిలో రాజధాని ఉండాలని పార్టీ రాష్ట్రశాఖ తీర్మానం చేసింది'' అని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన దగ్గుబాటి పురందేశ్వరి 'ఈనాడు' ఇంటర్వ్యూలో చెప్పినట్లు ఆ పత్రిక ఒక కథనంలో తెలిపింది.

 
ఆ కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని విషయంలో కేంద్రం తన పరిమిత పాత్ర గురించి హైకోర్టుకు అఫిడవిట్ల రూపంలో చెప్పిందని ఆమె తెలిపారు. ''ఈ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. పార్టీ పరంగా రాజధాని అమరావతిలో ఉండాలనే చెబుతున్నాం. రైతులకు న్యాయం జరగాలి. వారు స్థలాలు ఇచ్చిన చోట అభివృద్ధి జరగాల్సిందే. ఇందులో ఎటువంటి భిన్నాభిప్రాయాలూ లేవు. ప్రస్తుతం కోర్టులో ఉన్నందున ఎక్కువ చర్చ అక్కర్లేదు'' అని పురందేశ్వరి పేర్కొన్నారు.

 
దక్షిణాదిన పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు దీటుగా ఎదగటానికి ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నామని పురందేశ్వరి పేర్కొన్నారు. ''గత ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు ప్రత్యేక హోదా విషయంలో భాజపాను దోషిగా నిలబెట్టడంలో సఫలీకృతమయ్యాయి. హోదా ఇవ్వడం సాధ్యం కాకున్నా 'స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌' ఏర్పాటు చేస్తే ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్రం వెల్లడించింది. గత ప్రభుత్వం దాని గురించి అసలు పట్టించుకోలేదు'' అన్నారామె.

 
మిత్రపక్షంగా ఉన్న జనసేనతో కలిసి ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తామన్నారు. ''ఎన్డీయే నుంచి మిత్రపక్షాలు వాటంతట అవే వైదొలుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ, శివసేన, రాష్ట్రీయ లోక్‌ సమతాపార్టీ అలాగే వ్యవహరించాయి. మిత్రపక్షాలతో భాజపా సన్నిహితంగానే వ్యవహరిస్తోంది. వాటికి ప్రాధాన్యం ఇస్తోంది. అయినా కొన్ని పార్టీలు ఎన్డీయేను వీడుతున్నాయి'' అని పురందేశ్వరి చెప్పారు.

 
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైకాపా పాలనపై ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని.. హైకోర్టు నుంచి ఆ సర్కారుకు 65-70 వ్యాజ్యాల్లో ఎదురు దెబ్బలు తగిలాయని, అడుగడుగునా చీవాట్లు పడుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ''దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. దేవాలయాల ఆస్తులు, భూములకు రక్షణ లేకుండాపోతోంది. పార్టీపరంగా ప్రజాక్షేత్రంలో వీటిని ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వ చర్యలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. తగిన సమయంలో వారు బుద్ధి చెబుతారనడంలో ఎటువంటి సందేహం లేదు'' అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు