కరివేపాకు టీ తాగుదామంటే.. ధరలు పెరిగిపోయాయే..!

బుధవారం, 3 మార్చి 2021 (15:03 IST)
దేశంలో నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. దీంతో మధ్యతరగతి కుటుంబాల మనుగడ ప్రశ్నార్ధకమైంది. నిన్న, మొన్నటి వరకు పెట్రోల్‌, డీజిల్ ధరలే పెరుగగా.. తాజాగా నిత్యం కూరల్లో వాడే కరివేపాకు ధరలు కూడా పెరిగిపోయాయి. ఇందుకు కరివేపాకు దిగుబడి తగ్గడమే కారణం. ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ కు తగ్గ కరివేపాకు లేదు.
 
దీంతో హోల్‌సేల్‌ మార్కెట్‌లో కిలో కరివేపాకు.. ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో రూ.120కి ఎగబాకింది. ఇక రిటైల్‌ మార్కెట్‌లో ఒక కట్ట రూ.5 నుంచి 10కి అమ్ముతున్నారు. కేవలం..ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోని మార్కెట్లలలోనే ప్రతి రోజు దాదాపు 10 టన్నుల కరివేపాకు దిగుమతి అవుతుంది. గతంలో కిలో కరివేపాకు రూ.40 పలకగా.. ప్రస్తుతం దాని ధర దాదాపు మూడు రెట్లు పెరిగి రూ.120గా ఉంది.
 
ఇదిలావుంటే.. భారతీయుల వంటకాల్లో పూర్వకాలం నుంచి కరివేపాకుకు విశిష్ట స్థానం ఉంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కరివేపాకులో పుష్కలంగా లభించే యాంటీ ఆక్సిడెంట్లు, ఫెనొలిక్స్ చర్మాన్ని నాశనం చేసే ఫ్రీ-ర్యాడికల్స్‌తో పోరాడి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. 
 
దీంతోపాటుగా చర్మంపై మంట, ఇన్‌ఫెక్షన్స్ లాంటివి రాకుండా కరివేపాకు టీ సహాయపడుతుంది. కరివేపాకులో ఉండే అరోమా.. నరాలను రిలాక్స్ చేసి.. ఒత్తిడిని తగ్గిస్తుంది. కాబట్టి రోజంతా పని చేసి అలసిపోయిన వారు కచ్చితంగా కరివేపాకు టీ తాగడం వల్ల టెన్షన్, ఒత్తిడి నుంచి వెంటనే విముక్తి అవుతారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు