మారటోరియం సద్వినియోగం చేసుకోనివారికి క్యాష్ బ్యాక్ ఆఫర్!!

సోమవారం, 5 అక్టోబరు 2020 (11:56 IST)
కరోనా లాక్డౌన్ కారణంగా వ్యక్తిగత రుణాల చెల్లింపులపై కేంద్రం తొలుత మూడు నెలలు, ఆ తర్వాత మరో మూడు నెలల పాటు మారటోరియాన్ని విధించింది. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోకుండా, తన నెలవారీ కిస్తీలు చెల్లించిన వారికి క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇదే అంశంపై సుప్రీంకోర్టు కేంద్రం సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 
 
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. రూ.2 కోట్లలోపు రుణాలు తీసుకుని, క్రమం తప్పకుండా కిస్తీలు చెల్లించిన వ్యక్తిగత వినియోగదారులకు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కూడా ప్రయోజనం కలిగించే విధంగా 'క్యాష్‌ బ్యాక్' వంటి ప్రత్యామ్నాయాలపై కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. 
 
అంటే.. ఒకవేళ వారు కూడా మారటోరియాన్ని వినియోగించుకుని ఉంటే వడ్డీ మీద వడ్డీ పడి వారిపై ఎంత మేరకు భారం పడి ఉండేదో లెక్కించి, అంత సొమ్మును వారికి ఇచ్చే (అసలులో తగ్గించే) అవకాశాలను పరిశీలిస్తోందని ఆ వర్గాలు తెలిపాయి.
 
కొవిడ్‌ కారణంగా పరిశ్రమలు, వ్యాపారాలు మూతపడడంతో చాలా మంది ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయారు. వారికి ఊరట కలిగించేలా మార్చి నుంచి మారటోరియాన్ని ప్రకటించిన ఆర్బీఐ.. అది కేవలం తాత్కాలిక వెసులుబాటేనని, వాయిదాల మొత్తాన్ని అసలుకు కలిపి వడ్డీతో సహా వసూలు చేస్తామని చెప్పడంతో చాలా మంది కష్టపడి వాయిదాలు చెల్లించేశారు. 
 
కట్టలేనివారు మారటోరియాన్ని ఉపయోగించుకున్నారు. వారిపై చక్రవడ్డీ విధిస్తామంటే ఇక మారటోరియం ప్రయోజనం ఎలా నెరవేరినట్లవుతుందని సుప్రీంకోర్టు ప్రశ్నించడంతో కేంద్రమే ఆ భారాన్ని భరించడానికి సిద్ధమైంది. మారటోరియాన్ని ఉపయోగించుకున్నవారికి ఈ వెసులుబాటు కల్పిస్తూనే.. నిబద్ధతతో వాయిదాలు చెల్లించినవారికీ ఆ ప్రయోజనాలు కల్పిస్తామని స్పష్టం చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు