తెలుగు ఐఏఎస్‌కు అమెరికాలో కీలక పదవి!

గురువారం, 4 జూన్ 2020 (22:08 IST)
తెలుగు ఐఏఎస్ అధికారి ఒకరికి అత్యంత కీలక పదవి వరించింది. శ్రీకాకుళం జిల్లా కోటపాడు గ్రామానికి చెందిన రవి కోట 1993 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. అసోం క్యాడరు నుంచి తన ప్రస్థానం ఆరంభించి అంచెలంచెలుగా గుర్తింపు సంపాదించుకున్న రవి కోట ఇప్పుడు అమెరికాలో భారత ప్రత్యేక ఆర్థిక దౌత్య అధికారిగా నియమితులయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన క్యాబినెట్ నియామకాల కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
 
కాగా, రవి కోట వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయంలో సంయుక్త కార్యదర్శి హోదాలో వ్యవహరించనున్నారు. తన విధుల్లో భాగంగా భారత్ తరపున ఐఎంఎఫ్ (అంతర్జాతీయ ద్రవ్యనిధి), వరల్డ్ బ్యాంకు వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. రవి కోట మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఆయన రెండున్నరేళ్లుగా 15వ ఆర్థిక సంఘం సంయుక్త కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు.
 
రాజీవ్ టోప్నో కీలక పదవి 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రైవేటే కార్యదర్శి రాజీవ్ టోప్నోకు కీలక పదవి వరించింది. ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరక్టర్‌కు సీనియర్ సలహాదారుగా ఆయన్ను నియమించారు. 
 
1996 బ్యాచ్ గుజరాత్ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన రాజీవ్ మన్మోహన్ హయాంలో ప్రధాని కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా చేరారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక రాజీవ్‌ను తన టీమ్‌లోకి తీసుకున్నారు. 
 
ఊహించినట్లే ఆయన సమర్థుడిగా పేరు తెచ్చుకున్నారు. ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరక్టర్‌కు సీనియర్ సలహాదారుగా వెళ్లేందుకు రాజీవ్‌కు ప్రధాని నేతృత్వంలోని అపాయింట్‌మెంట్స్ కమిటీ క్లీయరెన్స్ ఇచ్చింది. ఈ పదవిలో ఆయన మూడేళ్లపాటు ఉంటారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు