ఢిల్లీ - ముంబైలో చేయిదాటిపోయిన కరోనా... ఆస్పత్రులుగా హోటళ్ళు

గురువారం, 15 ఏప్రియల్ 2021 (12:10 IST)
దేశ పాలన, ఆర్థిక రాజధానుల్లో పరిస్థితి చేయిదాటిపోయింది. కరోనా సునామీ విలయతాండవం చేస్తోంది. మహారాష్ట్ర, ఢిల్లీల్లో రోజురోజుకూ కరోనా కేసులు, మృతుల సంఖ్య పెరుగుతోంది. శ్మశాన వాటికల దగ్గరకు భారీ సంఖ్యలో మృతదేహాలు చేరుతున్నాయి. 
 
శ్మశానవాటికల దగ్గర ఈ స్థాయిలో మృతదేహాలను మునుపెన్నడూ లేనివిధంగా దహన సంస్కారాల కోసం వేచివుండాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి దేశ రాజధానిలో కరోనా ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉందో తేటతెల్లం చేస్తోంది. ఢిల్లీ ఆరోగ్య శాఖ బుధవారం విడుదల చేసిన డేటా మేరకు…24 గంటల్లో  ఆ రాష్ట్రంలో 17,282 కోవిడ్ పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి. 
 
ఢిల్లీలో 24 గంటల వ్యవధిలో మొత్తం 1,08,534 కోవిడ్ టెస్ట్‌లు చేపట్టగా… వీటిలో ఏకంగా 15.92 శాతం మేర పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి. ఈ స్థాయిలో పాజిటివ్ రేటు నమోదుకావడం ఇదే తొలిసారిగా అధికారులు చెబుతున్నారు. చివరగా నవంబరు 15న 15.33 శాతం పాజిటివ్ రేటు నమోదుకావడమే అత్యధికంగా ఉంటూ వచ్చింది.
 
మరోవైపు, రోజురోజుకూ కోవిడ్ కేసులు భారీగా పెరగడంతో ఆస్పత్రులు నిండిపోయాయి. బెడ్స్ కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ప్రముఖ ఆస్పత్రుల్లో ఐసీయూ బెడ్స్ అన్నీ నిండిపోవడంతో… ఎమర్జెన్సీ పరిస్థితుల్లోనూ బెడ్ కావాలంటే గంటల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. 
 
ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇదే పరిస్థితి నెలకొంటోంది. పరిస్థితి ఇప్పట్లో అదుపులోకి వచ్చే పరిస్థితులు లేవని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేసుల సంఖ్య పెరిగి బెడ్స్ కోసం మరింత డిమాండ్ నెలకొనే అవకాశముందని భావిస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని 15 హోటళ్లను తాత్కాలిక కోవిడ్ ఆస్పత్రులుగా మార్చుతున్నారు. వీటిని ప్రైవేట్ ఆస్పత్రులకు అనుసంధానం చేశారు. 5 స్టార్ హోటళ్లలో ఒక రోజు బెడ్ ఛార్జీలను రూ.5 వేలు, 3-4 స్టార్ హోటళ్లలో రూ.4 వేలుగా నిర్ణయించారు. ఆ మేరకు అదనంగా 3000 బెడ్స్‌ను కోవిడ్ రోగులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 
 
స్వల్ప లక్షణాలతో వచ్చే కోవిడ్ రోగులను ఇక్కడ అడ్మిట్ చేసుకుని చికిత్స కల్పిస్తారు. పరిస్థితి విషమిస్తే అక్కడి నుంచి ఆస్పత్రులకు తరలిస్తారు. ప్రైవేటు ఆస్పత్రులు ఈ హోటళ్లను కాంట్రాక్టుకు తీసుకుని తాత్కాలిక ఆస్పత్రులుగా నిర్వహిస్తాయి.
 
క్రౌన్ ప్లాజా, ఐటీసీ వెల్కమ్, రాడిస్సన్ బ్లూ, సూర్య తదితర 5 స్టార్ హోటళ్లను ఇలా కోవిడ్ ఆస్పత్రులుగా మార్చారు. అలాగే పలు బాన్‌క్వెట్ హాల్స్, ఓ స్కూల్, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను కూడా తాత్కాలిక కోవిడ్ ఆస్పత్రులుగా మార్చారు. వీటి ద్వారా 1,100 కోవిడ్ బెడ్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
 
అటు కోవిడ్ ఉధృతి తీవ్రంకావడంతో ముంబైలోని పలు 5 స్టార్ హోటళ్లను కోవిడ్ ఆస్పత్రులుగా మార్చాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తద్వారా అదనపు బెడ్స్‌ను కోవిడ్ రోగుల కోసం సిద్ధం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు