దేశంలో కరోనా ఉధృతి - 11 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు

సోమవారం, 20 జులై 2020 (12:31 IST)
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఫలితంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11 లక్షలు దాటిపోయాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 40425 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశంలో అత్యధికంగా నమోదైన పాజిటివ్ కేసులు ఇవే కావడం గమనార్హం. అదేసమయంలో 681 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
 
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 11,18,043కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 27,497కి పెరిగింది. 3,90,459 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 7,00,087 మంది కోలుకున్నారు.
 
కాగా, నిన్నటి వరకు దేశంలో మొత్తం 1,40,47,908 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. ఆదివారం ఒక్కరోజులో 2,56,039 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
 
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ స్వైర విహారం చేస్తోంది. అటు మరణాలు, ఇటు కొత్త కేసులు అడ్డు, అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 56 మంది మృత్యువాత పడగా, గడచిన 24 గంటల్లో 5,041 మందికి పాజిటివ్ అని తేలింది. దాదాపు అన్ని జిల్లాల్లో భారీగా కొత్త కేసులు వెల్లడయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 49,650కి చేరింది.
 
అలాగే తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులను పరిశీలిస్తే, కొత్తగా 1,296 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దాంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 45,076కి పెరిగింది. అత్యధికంగా జీహెచ్ఎంసీలో ఇవాళ 557 కేసులను గుర్తించారు. 
 
తాజాగా 1,831 మందిని డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం 12,224 మంది చికిత్స పొందుతున్నారు. ఇవాళ మరో ఆరుగురు కరోనాతో మృత్యువాత పడడంతో మొత్తం మరణాల సంఖ్య 415కి పెరిగింది. ఇది ఆదివారం నాటి కరోనా కేసులు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు