ఒకటి రెండు నెలల్లో కరోనాకు వ్యాక్సిన్ అసాధ్యం : సీసీఎంబీ

ఆదివారం, 5 జులై 2020 (14:12 IST)
ఒకటి రెండు నెలల్లో కరోనాకు వ్యాక్సిన్ వస్తుందని అనుకోవడం పొరపాటే అవుతుందనీ, కనీసం ఈ యేడాది ఆఖరు వరకు సమయం పట్టొచ్చని సీఎస్ఐఆర్ - సీసీఎంబీ సంచాలకులు రాకేశ్ మిశ్రా అభిప్రాయపడ్డారు. ఈ నెల 7వ తేదీ నుంచి హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవ్యాక్సిన్‌ను కరోనా రోగులపై ప్రయోగాలు జరిపేందుకు దేశంలోని పలు ఆస్పత్రులను ఎంపిక చేసిన విషయం తెల్సిందే. దీంతో మరో ఒకటి రెండు నెలల్లో కరోనాకు వ్యాక్సిన అందుబాటులోకి వస్తుందని ఐసీఎంఆర్ చెబుతోంది. 
 
కానీ, సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా మాత్రం మరోలా స్పందిస్తున్నారు. ఎంత భారీ స్థాయిలో క్లినికల్ ట్రయల్స్ చేసినా ఈ సంవత్సరం చివరిలోగా కరోనాకు వ్యాక్సిన్ రావడం చాలా కష్టమన్నారు. కరోనాకు వైరస్ కోసం ఎన్నో దేశాలు ప్రయోగాలు చేస్తున్నాయని, అవన్నీ వివిధ దశల్లో ఉన్నాయని గుర్తుచేశారు. 
 
ప్రస్తుతం చెబుతున్నట్టుగా అత్యంత ఖచ్చితత్వంతో జరిగితే, మరో ఎనిమిది నెలల్లో వ్యాక్సిన్ వస్తుందని భావించవచ్చని అంతకన్నా త్వరగా ఒకటి, రెండు నెలల్లో వచ్చే అవకాశాలు లేవని ఆయన అన్నారు. జబ్బున పడిన వారికి మందుబిళ్ల ఇచ్చినట్టు ఇచ్చి, తగ్గిందా? లేదా? అని చూసేందుకు ఇదేమీ డ్రగ్ కాదని, వైరస్ శరీరంలోకి వస్తే, దాన్ని నిలువరించే యాంటీబాడీలను అంతకు ముందే సిద్ధం చేయాల్సిన వ్యాక్సిన్ అని ఆయన అన్నారు. 
 
అన్ని వయసుల వారికి, రుగ్మతలు ఉన్నవారికి కూడా ఈ వ్యాక్సిన్ సరిపోతుందా? అన్నది తేల్చడం కూడా కీలకమైన అంశమన్నారు. వాస్తవానికి వ్యాక్సిన్‌ను తయారు చేయాలంటే, ఎన్నో సంవత్సరాలు పడుతుందని, కానీ, ప్రజలు ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు కాబట్టి, ఏ దేశంలోని ఏ కంపెనీ విజయవంతమైనా, వచ్చే సంవత్సరం వ్యాక్సిన్ వస్తుందని రాకేశ్ మిశ్రా పేర్కొన్నారు. తనకు అర్థమైనంత వరకూ అంతకన్నా ముందు మాత్రం వచ్చే అవకాశాలు లేవని స్పష్టం చేశారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు